ఆంధ్రాలో వైసీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాలలో కొత్తగా ‘బూతు సంస్కృతి’ పుట్టుకొచ్చింది. అలాగే భౌతికదాడులతో ఫ్యాక్షన్ సంస్కృతి కూడా రాష్ట్రమంతటా విస్తరించింది. పోలీస్ కేసులు, అరెస్టులు, రాజకీయ కక్ష సాధింపులు సర్వసాధారణమైపోయాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని సాక్షాత్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాయే అన్నారు. రాజకీయాలంటే పదిమంది గూండాలను వేసుకొని రోడ్లపై తిరుగుతూ, ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను, స్థానిక ప్రజలను భయ బ్రాంతులు చేయడమనే సంస్కృతి వైసీపిలో పేరుకుపోయిందని, నా వంటి పాతతరం రాజకీయ నాయకులు ఇటువంటి నీచ రాజకీయాలు చేయలేక ఇబ్బంది పడుతున్నామని వైసీపికే చెందిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారంటే వైసీపి తీరు అర్దం చేసుకోవచ్చు.
కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఈ కొత్త విష సంస్కృతులను ప్రవేశపెట్టిన వైసీపికే ఈ క్రెడిట్, బూతులు, భౌతిక దాడులకు పేటెంట్ రైట్స్ సొంతం అని చెప్పక తప్పదు.
ఇక విషయానికి వస్తే అంబటి రాంబాబు మంత్రి అని అందరికీ తెలుసు కానీ సాగునీటి శాఖ మంత్రి అని రాష్ట్రంలో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఆయన ‘అరగంట కార్యక్రమం’, సంక్రాంతికి సత్తెనపల్లి రోడ్లపై వేసే డాన్సులతో చాలా ఫేమస్ అయ్యారని అందరికీ తెలుసు.
ఆయన నిన్న ఖమ్మంలో ఓ శుభకార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఆయనను అడ్డుకొని దుర్భాషలాడారు. ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించారు కూడా. కానీ పోలీసులు వారిని అడ్డుకొని అంబటి రాంబాబుని అక్కడి నుంచి పంపేశారు.
ఈ ఘటనపై అంబటి రాంబాబు స్పందిస్తూ, “వారు టిడిపి కార్యకర్తలో కాదో నాకు తెలీదు కానీ కులోన్మాదులని వారి మాటల ద్వారా నాకు అర్దమైంది. వారు నన్ను లేపేస్తామని బెదిరించారు. వారి చేతుల్లో కర్రలున్నాయి. ఇంకా మారణాయుధాలు కూడా ఉండే ఉండవచ్చు. రాజకీయ నాయకులపై భౌతికదాడులకు పాల్పడేందుకు ప్రయత్నించే ఇలాంటి కులోన్మాదులని క్షమించరాదు. ఇది క్షమించరాని నేరం,” అంటూ చాలా ఆవేశంగా మంత్రి అంబటి ఇంకా చాలానే మాట్లాడారు.
మరైతే ఈ నాలుగున్నరేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి నేతలు, కార్యకర్తలు, పార్టీ కార్యాలయాలపై చేస్తున్న దాడులను ఆయన ఎందుకు ఖండించలేదు? రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నప్పుడు ఎందుకు స్పందించలేదు?రాజకీయ కక్షతో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే గట్టిగా సమర్ధించుకొంటున్నారు కదా?
అంటే ప్రతిపక్షాలపై దాడులు జరిగితే అవన్నీ ఆయనకు కనిపించవు. కానీ ఓ సినిమాలో చిన్న సన్నివేశామో లేదా ఇలా ఎవరైనా తనపై దాడికి ప్రయత్నిస్తే ప్రళయం వచ్చేసిన్నట్లే ప్రజలందరూ భావించాలని అంబటి రాంబాబు కోరుకొంటున్నట్లున్నారు.
అయినా అద్దాల మేడలో కూర్చొని దారిన పోయే వాళ్లపై రాళ్ళు విసురుతున్నప్పుడు, అటువైపు నుంచి కూడా రాళ్ళు పడతాయని తెలియదా? అంబటి రాంబాబు గారూ?




