‘మళ్ళీ మనమే అధికారంలోకి…’ అనే ఆలోచనే రాజకీయ నాయకులకు మంచి కిక్కిస్తుంది. ఆవిధంగా దానికి అడిక్ట్ అయిపోతుంటారు. అందుకే రోజూ అదే చెపుతుంటారు. కానీ మళ్ళీ మనమే అని మనలో మనం అనుకుంటే సరిపోదు… జనం కూడా నమ్మాలి కదా? అప్పుడే అది నిజమవుతుంది.
ఇంతకీ విషయం ఏమిటంటే, సిఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మన అంబటి రాంబాబు గురువారం కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా “చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్దంగా కూల్చేస్తానని అంబటి రాంబాబు భీకర శపథం చేశారు. ‘ప్రజాస్వామ్యబద్దంగా’ అనే మాట కలపకపోయుంటే అర్థం మారిపోయేది. కానీ కలిపారు కనుక ఆ యాంగిల్లోనే చూద్దాం.
కూటమి ప్రభుత్వాన్ని బద్దంగా కూల్చేయడం అంటే ‘మళ్ళీ మనమే’ అని అంబటి రాంబాబు చెపుతున్నారని అర్థం చేసుకోవాలి.
తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ ‘మళ్ళీ మనమే’ పాట పాడిన ప్రతీసారి రేవంత్ రెడ్డి అసమర్ద పాలన, చంద్రబాబు బూచి వంటి చరణాలతో ముగిస్తుంటారు. కనుక ఆ పాట వినసొంపుగానే ఉంటుంది.
కానీ వైసీపీ పాడే ‘మళ్ళీ మనమే’ పాటలో తదుపరి చరణాలు ఏవీ సరిగ్గా అతకవు. కనుక ఆ పాట నమ్మశఖ్యంగా ఉండదు.
మళ్ళీ మనమే దేనికి? శాసనసభకు వెళ్ళకుండా ప్యాలస్ల చుట్టూ తిరుగుతున్నందుకా? రప్పా రప్పా మావిగన్ అంటున్నందుకా? అంటే సరైన సమాధానం లభించదు. కానీ ‘మళ్ళీ మనమే’కి వైసీపీలో అందరూ అడిక్ట్ అయిపోయారు కనుక ఆత్మవంచన చేసుకుంటూ గట్టిగా పాడుతూనే ఉంటారు. కానీ దేనికో ఎవరికీ అర్థం కాదు. ప్రజలకు అర్థం కానప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య బద్దంగా ఎలా కూల్చేయగలరు? కనుక ఇది కూడా రొటీన్ ‘రోటి పాట’ అని సరిపెట్టుకోక తప్పదు.




