రాష్ట్రంలో ఉన్న దళితులందరికి మేనమామ ఈ జగన్ మామా అంటూ గొప్పలు చెప్పుకునే ఈ వైసీపీ ప్రభుత్వ పెద్దలు అసలు జగన్ ఇంటి పక్కన దళితుల ఆరాధ్య దైవంగా భావించే అంబేడ్కర్ విగ్రహం పై జరుగుతున్న దాడిని ఆపలేని నిస్సహాయస్థితిలో ఉన్నారా అంటూ తమ ఆవేదనను వ్యక్త పరుస్తున్నారు దళిత సోదరులు.
నా ఎస్సి, నా ఎస్టీ..అంటూ మైకుల ముందు ఉపదంపుడు ఉపన్యాసాలు చదివే ముఖ్యమంత్రి జగన్ తన నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న అంజి రెడ్డి కాలనీ సమీపంలో చెత్తలో పడేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని అలాగే వదిలేశారు. అలాగే ఆ విగ్రహం పై ఏవేవో దుస్తులు వేస్తూ ఆ విగ్రహానికి ఉన్న గౌరవాన్ని దిగజారుస్తున్నారు. అసలు ఆ విగ్రహాన్ని చెత్తలో పడేసింది ఎవరో విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇప్పటివరకు ఎటువంటి విచారణకు అడుగు ముందుకు వెయ్యలేదు. కనీసం ఆ విగ్రహాన్ని తీసి సరైన స్థానంలో ఉంచనూలేదు.
సామజిక సాధికారత అంటూ బస్సులో యాత్రలు చేస్తే సరిపోదు. సమాజంలో సాధికారత సాధించే చర్యలు తీసుకోవాలి.కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చినందుకు గాను ప్రతిఫలంగా ఎప్పటినుంచో దళితులకు అందుబాటులో ఉన్న ‘అంబేడ్కర్ విదేశీ విద్య’కు పేరు మార్చి ‘జగనన్న విదేశీ విద్య’గా నామకరణం చేసుకున్నారు జగన్.
ఇప్పుడు అదే ఫార్ములా వాడారేమో అన్నట్టుగా విజయవాడ స్వరాజ్య మైదానంలో 125 అడుగుల అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు కాబట్టి ఇటువంటి చిన్న విగ్రహాల పై ఆకతాయిలు జరిపే దాడులను పరిగణలోకి తీసుకోబోరేమో జగన్ ప్రభుత్వం అన్నట్టుగా అంజి రెడ్డి కాలనీలో అంబేడ్కర్ విగ్రహాన్ని గాలికొదిలేశారు అధికారులు.
దళితుల మీద జరిగే దాడులకు బాధితులకు న్యాయం చేయలేరు కానీ అంబేడ్కర్ పేరు అడ్డుపెట్టుకుని రాజకీయాలు మాత్రం చేయగలరు ఈ వైసీపీ నాయకులు అంటూ ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ నేతల మీద విమర్సధాలు గుప్పిస్తున్నారు.అలాగే ప్రతిపక్ష పార్టీల నేతల పై మాటల దాడికి వెనుకడుగు వేయని వైకాపా దళిత నాయకులు జగన్ నిర్ణయాల పై నోరుమెదపలేని దుస్థితిలో ఉన్నారు. ఇవేనా జగన్ ప్రభుత్వంలో దళితులకు దక్కిన ప్రస్వామ్య హక్కులు, ఇదేనా జగన్ ప్రభుత్వంలో అంబేడ్కర్ కు ఇచ్చే గౌరవం? అంటూ నిందిస్తున్నారు స్థానిక దళిత సోదరులు.




