చిన్న చిన్న అంశాలలో తనను టార్గెట్ చేసుకుని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేయడంతో కలత చెందిన హాట్ యాంకర్ అనసూయ, సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ళుగా దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మళ్ళీ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. “రంగస్థలం” సినిమాలో పోషించిన రంగమ్మత్త క్యారెక్టర్ తో కూడిన ఫోటోను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలోకి వచ్చిన అనసూయపై నెటిజన్ల తీరు మారకపోవడం విశేషం.
‘సెల్ ఫోన్ కొనిచ్చారా? లేదా? ముందు అది చెప్పండి’ అని కొందరు… ‘అనసూయ ఆంటీ’ అని మరికొందరు… ‘మేకప్ లేనిదే చూడలేమని’ ఇంకొందరు విమర్శల వెల్లువ కొనసాగిస్తున్నారు. మధ్యలో కాస్త విరామం తీసుకున్నా… తన పట్ల నెటిజన్ల తీరు మారలేదని ఈ పాటికే అనసూయకు అర్ధమై ఉంటుంది. కాబట్టి వారి వ్యాఖ్యలను ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటే, అనసూయకు కూడా ఇబ్బంది ఉండదు. పబ్లిక్ ఫ్లాట్ ఫాంలో ఉన్నపుడు తలో మాట మాట్లాడడం సహజం.
వాటిని వ్యక్తిగతంగా తీసుకుని, మైండ్ లోకి ఎక్కించుకుంటే చివరికి మానసిక క్షోభ అనసూయకే గానీ, నెటిజన్లకు కాదు. అందరికీ మనం నచ్చేయాలి, అందరూ పొగిడేయాలని అనుకోవడం మన తప్పే. సెలబ్రిటీగా ఉన్నపుడు పొగడ్తలు ఎలా వస్తాయో, విమర్శలు అంతకు మించిన స్థాయిలో ఉంటాయి. పెద్ద పెద్ద హీరోలకే ఇవి తప్పడం లేదు. మరి అనసూయ వంటి యాంకర్లు ఇందుకు మినహాయింపు కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఎందుకంటే నేడు సోషల్ మీడియా అలా తయారయ్యింది!



