శాసనసభ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, 10 మంది ఎమ్మెల్యేలు రాకపోవడాన్ని సిఎం చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తీవ్రంగా ఆక్షేపిస్తుంటారు. కానీ ఇప్పుడు వారికే కొత్త సమస్య వచ్చి పడింది.
కూటమి పార్టీల ఎమ్మెల్యేలలో కొందరు హాజరు వేసుకోవడం కోసమే సభకు వస్తుంటే, మరికొందరు కాసేపు సభలో కూర్చొని మెల్లగా లేచి వెళ్ళిపోతున్నారు. చాలా మంది ‘హాజరు సరిపోతుంది కదా మరెందుకు?’ అని శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు.
ప్రతిపక్షపార్టీని వేలెత్తి చూపుతున్నప్పుడు కూటమి సభ్యులే ఇలా ప్రవర్తిస్తే ఎలా?అప్పుడు వారు కూడా విమర్శించకుండా ఉంటారా?కూటమిలో మూడు పార్టీలకు కలిపి 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఈరోజు శాసనసభ సమావేశానికి కేవలం 30 మంది మాత్రమే హాజరయ్యారు.
ఎమ్మెల్యేలు రాకపోవడంపై సిఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన బిల్లులపై సభలో చర్చజరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలు సభకు రాకుండా సొంత పనులు చక్కబెట్టుకోవడం సరికాదన్నారు. దీంతో ఎమ్మెల్యేలకు విప్లు ఫోన్లు చేయగా మరో 15 మంది మాత్రమే వచ్చారు.
టికెట్స్ కోసం పోటీలు పడి, ఎన్నికలలో గెలిచేందుకు ఎంతో శ్రమించి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారు, ఆ తర్వాత మంత్రి పదవులు లేదా నామినేటడ్ పదవులు ఆశిస్తుంటారు. కానీ శాసనసభ సమావేశాలకు హాజరు కావాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, కంపెనీలలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు ప్రతీరోజూ డ్యూటీకి తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. లేకుంటే జీతంలో కోత తప్పదు. ఆ తర్వాత క్రమశిక్షణ చర్యలు తప్పవు.
కానీ ఏడాదికి సుమారు 50-60 రోజులు మాత్రమే జరిగే శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు కూడా ఎమ్మెల్యేలు ఇష్టపడటం లేదు! తీరిక ఉండటం లేదు!
అధికారులు, ఉద్యోగుల జీతభత్యాలు కోసి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నప్పుడు శాసనసభ సమావేశాలకు రాని సభ్యులపై కూడా చర్యలు తీసుకోవచ్చు కదా?
ఒకవేళ ప్రభుత్వం ఈ పని చేయకపోతే శాసనసభ సమావేశాలకు హాజరవ్వని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎన్నికలలో ప్రజలే తిరస్కరించాలి. ఆ భయంతోనైన అందరూ తప్పనిసరిగా శాసనసభ సమావేశాలకు హాజరవుతారు!






