ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్లో అడుగుపెట్టలేక మహారాష్ట్రవైపు పయనించింది. కానీ ఏపీ రాజకీయాలలో వైఎస్ షర్మిల సడన్ ఎంట్రీ ఇస్తుండటంతో ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళ్ళి కేసీఆర్ సాయం కోరడంతో బిఆర్ఎస్ పార్టీకి ఆంద్రా తలుపులు మళ్ళీ తెరిచిన్నట్లయింది.
కనుక ఏపీ శాసనసభ ఎన్నికలలో కేసీఆర్ మళ్ళీ చక్రం తిప్పి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నించడం ఖాయంగానే కనిపిస్తోంది.
ఇప్పటికే ఏపీలో బిఆర్ఎస్ పార్టీ ఉంది. కనుక దానిని మళ్ళీ యాక్టివ్ చేసి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను, ముఖ్యంగా కాపుల ఓట్లను చీల్చి టిడిపి, జనసేనలను దెబ్బతీసేందుకు ప్రయత్నించవచ్చు. తెలంగాణలో ‘తెలంగాణ సెంటిమెంట్’ రగించిన్నట్లే, ఏపీలో కూడా ‘ఏపీ సెంటిమెంట్’ రగిలించి వైసీపికి తోడ్పడేందుకు, బిఆర్ఎస్, వైసీపిలు ఉత్తుత్తి యుద్ధాలు చేస్తూ ఏపీ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించవచ్చు.
గత నాలుగున్నరేళ్ళుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య విభజన సమస్యలు పరిష్కరించుకోవడానికి కేసీఆర్, జగన్ ఇద్దరూ చొరవ తీసుకోలేదు. కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదు. కానీ ఏపీ, తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పరస్పరం సహకరించుకోవడానికి ఎప్పుడూ సిద్దంగానే ఉండటం విశేషమే కదా?
అయితే కేసీఆర్, జగన్ ఒకే ఒక్క తేడా కనిపిస్తోంది. కేసీఆర్ అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించలేదు. వాటిని దృష్టిలో ఉంచుకునే రాజకీయాలు చేస్తుంటారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి సహకరించినా తెలంగాణ లాభపడుతూనే ఉంది. కేసీఆర్ చేతికి మట్టి అంటకుండానే అమరావతి నిర్మాణ పనులు నిలిపివేయించగలిగారు. చేతికి మట్టి అంటకుండానే ఏపీ నుంచి తెలంగాణకు పరిశ్రమలు రప్పించుకోగలిగారు.
కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన పార్టీ, పదవి, అధికారం, పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుంటారు. అందుకే ఏపీకి నష్టం కలిగిస్తున్న కేసీఆర్తో మళ్ళీ చేతులు కలిపేందుకు సిద్దం అవుతుండటమే ఇందుకు తాజా నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కనుక ఒకవేళ బిఆర్ఎస్ పార్టీ ఏపీలో రాజకీయాలు చేసేందుకు వస్తే టిడిపి, జనసేనలు మాత్రమే కాదు… ఆంధ్రా ప్రజలు కూడా తగిన గుణపాఠం నేర్పి మరీ వెనక్కు తిప్పి పంపించాల్సి ఉంటుంది.




