అభివృద్ధి, వినాశనాన్ని రెంటినీ ఎవరూ దాచలేరు. గత ప్రభుత్వ హయంలో ఏపీలో జరిగిన వినాశనాన్ని ప్రజలే కాదు… ఇరుగు పొరుగు రాష్ట్రాలు కూడా గుర్తించాయి… మాట్లాడుకున్నాయి. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని రాష్ట్ర ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. అలాగే ఇరుగు పొరుగు రాష్ట్రాలు కూడా మాట్లాడుకుంటున్నాయి.
రాజధాని అమరావతి నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఒకేసారి అనేక బ్యాంకులు, హైకోర్టు నూతన భవన సముదాయం, ఇంకా పలు భవనాల నిర్మాణ పనులు చాలా జోరుగా సాగుతున్నాయి.
పోలవరం ఎడమ కాలువ పనులలో భాగంగా కాకినాడ జిల్లా తుని మండలంలోని కుమ్మరిలోవ వద్ద తాండవ నది-రేఖవానిపాలెం వద్ద అక్విడక్ట్ నిర్మాణం ఏడాదిలోనే పూర్తయింది.
ఇక పరిశ్రమలు, ఐటి కంపెనీలకు ఓ పక్క శంకుస్థాపనలు, మరోపక్క ప్రారంభోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి.
వీటిలో ప్రధాని మోడీ స్వయంగా శంకుస్థాపన చేసినవి కొన్నయితే కేంద్ర మంత్రులు ప్రారంభించినవి మరికొన్ని ఉన్నాయి. కనుక ఇవన్నీ గాలి కబుర్లని కొట్టి పడేయలేరు.
ఇక విశాఖ, విజయనగర, శ్రీకాకుళం జిల్లాల మద్యన భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు అప్పుడే కొలిక్కి వస్తున్నాయి. అక్కడ జనవరి 4న తొలి విమానం ల్యాండ్ కాబోతోంది. ఢిల్లీనుంచి పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వస్తున్న విమానం భోగాపురంలో ల్యాండ్ కాబోతోంది. అంటే విమానాశ్రయం పనులు కొలిక్కి వస్తున్నాయని స్పష్టమవుతోంది కదా?
ఇవన్నీ కేవలం 18 నెలల్లోనే జరిగాయి. పాలకులకు చిత్తశుద్ధి, నిబద్దత ఉంటే ఎంత వేగంగా రాష్ట్రాలన్ని అభివృద్ది చేసుకోవచ్చో తెలుసుకునేందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తోంది.
ఇంత వేగంగా రాష్ట్రాభివృద్ధి జరుగుతుంటే, రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు, ఐటి కంపెనీలు తరలివస్తుంటే రప్పారప్పా అంటూ వైసీపీ అవరోధాలు సృష్టిస్తుండటం చాలా బాధాకరమే. కానీ వైసీపీ స్పీడ్ బ్రేకర్లని కూడా దాటుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పధంలో ముందుకు దూసుకుపోతూనే ఉంది.




