ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే వృద్ధులకు నెలకు రూ.2,000 పింఛన్ ఇస్తుండగా, వాలంటీర్ల వ్యవస్థ ఒకటి సృష్టించి దాంతో లక్షల మంది వైసీపి కార్యకర్తలకు నెలకు రూ.5,000 చొప్పున ఇస్తుండటం విశేషం. ప్రభుత్వం వారికి నేరుగా డబ్బు చెల్లిస్తే ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయని, కోర్టుల్లో కేసులు ఎదుర్కోవలసి వస్తుందనే ముందు చూపుతో తెలివిగా ఈ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రజాధనాన్ని వారికి పప్పు బెల్లాలాగ పంచిపెడుతోందని చెప్పవచ్చు. వారి వలన ప్రజలకు ఏమి మేలు కలుగుతోందో తెలీదు కానీ వైసీపికి మేలు కలుగుతున్నట్లే ఉంది. అందుకే వాలంటీర్లకు మళ్ళీ అవార్డులు, రివార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా అమలవుతోంది.
వీటికి తోడు పురపాలక సంఘాలు, గ్రామ పంచాయితీలకు సమాంతరంగా సచివాలయ వ్యవస్థలను సృష్టించి గందరోగోళం సృష్టించింది. కనుక ప్రజలు తమ పనుల కోసం వాటి మద్య ప్రదక్షిణాలు చేయవలసివస్తోంది. వాలంటీర్లకు, సచివాలయాల నిర్వహణ, సిబ్బంది జీతాల చెల్లింపులు తలకు మించిన భారమే అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఇవన్నీ చాలా గొప్ప ఆవిష్కరణలుగానే భావిస్తుండటం విశేషం.
ఇవి సరిపోవన్నట్లు 13 జిల్లాలను 26 జిల్లాలుగా విడదీయడంతో కొత్త జిల్లాలకు అదనపు సిబ్బంది, వారికి కార్యాలయాలు, వారి జీతభత్యాలు, వాటి నిర్వహణ ఖర్చులు తడిపిమోపెడవుతున్నాయి.
సంక్షేమ పదకాలకు నిధులు, ప్రభుత్వోద్యోగులకు నెలనెలా జీతాలు ఇవ్వడానికి తడుముకోవలసి వస్తుంటే ఈ కొత్త జిల్లాల భారం వైసీపీ ప్రభుత్వం ఎందుకు తలకెత్తుకొందో దానికే తెలియాలి. ఇలా ఎప్పటికప్పుడు కొత్తగా సృష్టించుకొంటున్న ఈ అదనపు భారాలతో ఏదో ఓ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంకలా దివాళా తీస్తుందేమో? అని ప్రజలు సైతం భయపడుతున్నారు.



