ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టులో మొట్టికాయలో బ్రేకులో పడుతూనే ఉన్నాయి. వివాదాస్పద నిర్ణయాలే అందుకు కారణం. మూడు రాజధానులకు హైకోర్టు బ్రేకు వేయడం, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసులో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడం అందరికీ తెలుసు. అయినా జగన్ సర్కార్ తీరు మారలేదు.
సినీ నియంత్రణ చట్టం పేరుతో సినీ పరిశ్రమను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న జగన్ సర్కార్, సినిమా టికెట్లను ఏపీఎఫ్డీసీ ద్వారానే ఆన్లైన్లోనే అమ్మాలని సినిమా థియేటర్ల యజమానులకు హుకుం జారీ చేసింది.
ఒక్కో టికెట్ అమ్మకంపై రూ.2 చొప్పున సర్వీసు ఛార్జి కూడా చెల్లించాలని ఆదేశించింది. వేరే గత్యంతరంలేక థియేటర్ల యజమానులు అందుకు సిద్దపడినప్పటికీ, టికెట్ల అమ్మకం ద్వారా వసూలైన సొమ్మును మర్నాడు వారికి తిరిగి ఇవ్వడం లేదు. దీంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.
జగన్ ప్రభుత్వ నిర్ణయంతో థియేటర్ల యజమానులతో పాటు ఆన్లైన్లో సినిమా టికెట్స్ అమ్మే బుక్మై షో (బిగ్ ట్రీ ఎంటర్టెయిన్మెంట్) వంటి సంస్థలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. కనుక అవి కూడా హైకోర్టును ఆశ్రయించాయి. వాటి పిటిషన్పై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది.
తమ వంటి ఆన్లైన్ సంస్థలు కూడా ఏపీఎఫ్డీసీ ద్వారానే టికెట్లు అమ్మాలని, దాని కోసం ఒక్కో టికెట్కు రూ.2 చొప్పున సర్వీసు ఛార్జీ చెల్లించాలనడం సరికాదని, ఏపీ ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం వలన తమ వంటి ప్రైవేట్ సంస్థల వ్యాపారాలు దెబ్బ తింటాయని వాదించాయి. అయితే ఈ విదానం ద్వారా పారదర్శకత పెరుగుతుందని ఏపీ ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూలై 27కి వాయిదా వేసింది.
కేంద్రప్రభుత్వం పరిపాలనకు మాత్రమే పరిమితమైతే చాలనుకొని లాభాలు తెచ్చిపెట్టే ప్రభుత్వరంగ సంస్థలను సైతం వదిలించుకొంటుంటే, జగన్ సర్కార్ ఇసుక, మద్యం, పాలు, సినిమా టికెట్లు, రియల్ ఎస్టేట్ ఇలా ప్రతీ వ్యాపారంలోను వేలుపెడుతూ అన్నిట్లో నేనున్నాను అంటోంది. ఆ దెబ్బకు తట్టుకోలేనివారు దణ్ణం పెట్టి వెళ్ళిపోతున్నారు.



