దేవుడా… 11వ నెల, 11వ తేదీన శాసనసభ సమావేశాలట!

Andhra Pradesh Legislative Assembly Sessions November 2024

ఒకప్పుడు శాసనసభ సమావేశాలలో ఇక్కడ జగన్‌, అక్కడ కేసీఆర్‌ సింహాల్లా చెలరేగిపోయేవారు. ఇద్దరిలో కేసీఆరే చాలా నయం. ఆయనకు ప్రభుత్వానికి సంబందించి ప్రతీ కార్యక్రమం, పధకం, అంశం గురించి పూర్తి అవగాహన ఉండేది. కనుక దేని గురించైనా చాలా సాధికారంగా మాట్లాడుతూ ప్రజలను కూడా ఆకట్టుకునేవారు.

ADVERTISEMENT

కానీ జగన్‌ అండ్ కోలో ఏ ఒక్కరికీ తమ శాఖల గురించి పెద్దగా అవగాహన లేదు. రాష్ట్రంలో సంక్షేమ పధకాల గోల తప్పితే మరొకటి ఉండేదే కాదు. కనుక మంత్రులు, వైసీపి ఎమ్మెల్యేలు అందరూ శాసనసభలో జగన్‌ భజన చేస్తూ, ఆయన కళ్ళలో ఆనందం, పెదవులపై ముసిముసి నవ్వులు చూడటం కోసం చంద్రబాబు నాయుడుని, ఆయన కుటుంబ సభ్యులను కించపరుస్తూ మాట్లాడేవారు.

కానీ ఇప్పుడు వారందరి పరిస్థితి తారుమారు అయ్యింది. వైసీపికి కనీసం ఓ 20-30 మంది ఎమ్మెల్యేలున్నా అందరూ ధైర్యం చేసి శాసనసభ సమావేశాలకు వచ్చేవారేమో?కానీ పట్టుమని 10 మందితో కలిసి శాసనసభలో అడుగుపెట్టాలంటే జగన్‌కు చాలా గుండె ధైర్యం ఉండాలి కదా?

కనుక ఎన్నికలలో టికెట్‌ లభించనివారు, పోటీ చేసి ఓడిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, రోజా వంటివారు చాలా అదృష్టవంతులే అనుకోవచ్చు. వైసీపిలో జగన్‌తో సహా గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఇన్నిరోజులుగా బోనులో నుంచి తప్పించుకుని బయటపడిన పులుల్లాగే తిరుగుతున్నారు.

కానీ నవంబర్‌ 11వ తేదీ నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అదే రోజున ఉభయసభలలో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత 10 రోజులు సమావేశాలు నిర్వహించి బడ్జెట్‌పై చర్చించనున్నారు.

కనుక జగన్‌ బ్యాచ్‌కి ‘ఇన్‌ ఫ్రంట్ దేరీజ్ క్రోకడైల్ ఫెస్టివల్” అన్నట్లే ఉన్నాయి ఈ సమావేశాలు. ధైర్యం చేసి వస్తే టిడిపి, జనసేనలు వారితో చెడుగుడు ఆడేసుకుంటాయి.

నాడు ఇదే శాసనసభలో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి గురించి నోటికి వచ్చిన్నట్లు వాగుతూ, చంద్రబాబు నాయుడు అవహేళన చేస్తూ ఆయన కన్నీళ్ళు పెట్టుకునేలా చేసినందుకు, టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్‌పై శాసనసభలోనే ప్రతీకారం తీర్చుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయం అందరి కంటే జగన్‌కే బాగా తెలుసు.

కానీ జగన్‌కి అహం దెబ్బతింటే అసలు తట్టుకోలేరు. కనుక శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు రాక పోవచ్చు. బెంగళూరు వీలైతే లండన్‌ వెళ్ళిపోయి తప్పించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఆయన రాకపోతే వైసీపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ కూడా శాసనసభకు రారాని వేరే చెప్పక్కరలేదు.

చివరిగా చిన్న ధర్మ సందేహం. 11వ నెల, 11వ తేదీన, ఉదయం 11 గంటలకు శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభిస్తుండటం దేనికి సంకేతమబ్బా?

ADVERTISEMENT
Latest Stories