అమరావతినే రాజధానిగా చేయాలని రాష్ట్రంలో ఎవరూ గట్టిగా అనలేని పరిస్థితి కల్పించింది వైసీపీ ప్రభుత్వం. ‘అమరావతి రాజధాని’ అనే పదంపై ఇప్పుడు ఏపీలో అనధికార నిషేదం అమలులో ఉంది. ఒకవేళ ఎవరైనా ఆ మాట అంటే ముందుగా వారిపై రాష్ట్ర ద్రోహులుగా ముద్ర వేస్తారు. ఆ తర్వాత వారిపై అక్రమ కేసులు నమోదైపోతాయి.
రాష్ట్రంలో ప్రజల అభీష్టం మేరకు పనిచేయాల్సిన ప్రభుత్వం, ఈవిదంగా ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా గొంతు బలవంతంగా నొక్కేసి విశాఖను రాజధానిగా ఒప్పుకొని తీరాలని బలవంతం చేస్తోంది. కాదంటే జిల్లా సరిహద్దుల వరకు తరిమి కొట్టాలని సాక్షాత్ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది.
ఈ నేపధ్యంలో విశాఖలోనే అమరావతికి మద్దతుగా ఓ ఐకాస ఏర్పాటు కావడం, నగరం నడిబొడ్డున మునిసిపల్ కార్పొరేషన్ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద నిలబడి ఆ విషయం ప్రకటించడం చాలా అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి పేరిట ఏర్పడిన ఈ ఐకాసకు కన్వీనర్గా దండి ప్రియాంక రావు, నిర్వహణ కార్యదర్శిగా జగన్ మురారి వ్యవహరిస్తున్నారు.
వారి అధ్వర్యంలో ఆదివారం ‘ఆంద్రుడా మేలుకో’ అంటూ పోస్టర్స్, కరపత్రాలు విడుదల చేశారు. విశాఖ నగర ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి అమరావతి రాజాధానిగా చేయాలని కోరుతూ గాంధీ బొమ్మ వద్ద ధర్నా చేశారు.
అనంతరం దండి ప్రియాంక రావు మీడియాతో మాట్లాడుతూ, “ఒకవేళ అమరావతి రాజధానిగా వైసీపీకి అంగీకారం కాదనుకొంటే ఆ విషయం అప్పుడే శాసనసభలోనే నిర్భయంగా చెప్పి తాము మూడు రాజధానులతో వికేంద్రీకరణ కోరుకొంటున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్పి ఉండాలి. కానీ ఆనాడు అమరావతికి పూర్తి మద్దతు ప్రకటించి ఇప్పుడు మాట మార్చి మూడు రాజధానులంటూ ప్రజల మద్య ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టడం సబబు కాదు.
మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే విశాఖలో అధికారులు హైకోర్టుకి వెళ్ళాలంటే 700 కిమీ, సచివాలయానికి వెళ్ళాలంటే 300 కిమీ ప్రయాణించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేయగలదు? అదే… అన్నీ ఒకేచోట రాష్ట్రంలో మద్యన అమరావతిలో ఉంటే అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది కదా?
అమరావతిలో ఇప్పటికే వేలకోట్ల ప్రజాధనం ఖర్చు చేసి సచివాలయం, హైకోర్టు, శాసనసభ, మండలి, ఇతర భవనాలు నిర్మించబడ్డాయి. ఇప్పుడు వాటన్నిటినీ వద్దని విశాఖకు తరలివస్తే వాటి పై ఖర్చు చేసిన వేలకోట్ల ప్రజాధనం అంతా వృధా అయిపోతుంది కదా?విశాఖలో రాజధాని అంటే మళ్ళీ వేలకోట్లు ప్రజాధనం ఖర్చు చేయాల్సి ఉంటుంది కదా? కనుక అమరావతినే రాజధానిగా కొనసాగించడం మంచిదని మేము ప్రభుత్వానికి సూచిస్తున్నాము,” అని అన్నారు.
ఈ ఐకాస నిర్వహణ కార్యదర్శిగా జగన్ మురారి మీడియాతో మాట్లాడుతూ, “రాజధాని అంటే కేవలం ఐటి కంపెనీలు మాత్రమే కావు. ప్రభుత్వ నిర్వహణకు సంబందించిన ప్రతీ కార్యాలయం రాజధానిలో ఉండాలి. ఇప్పటికే అమరావతిలో సచివాలయం, శాసనసభ, మండలి, హైకోర్టు వగైరాలన్నీ ఉన్నాయి. విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలంటే వాటన్నిటినీ విశాఖకు తరలించాలి లేదా కొత్తగా మళ్ళీ అన్ని నిర్మించుకోవాలి.
అసలు విశాఖ నగరంలో రాజధానికి సరిపడే రోడ్డు ఒకటైనా ఉందా? ప్రస్తుతం ఉన్న వాహనాలతోనే ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్థంభించిపోతుంటుంది. రాజధాని ఏర్పాటు చేస్తే ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, వారి భద్రతా సిబ్బంది అందరూ కలిపి మరో లక్ష మంది, వాహనాలతో విశాఖకు తరలివస్తే ఏమవుతుందో ఊహించుకోవచ్చు. ప్రభుత్వం విశాఖను అభివృద్ధి చేయాలనుకొంటే నిరభ్యంతరంగా అభివృద్ధి చేయవచ్చు కానీ దాని కోసం రాజధాని ఏర్పాటు చేయనక్కరలేదు,” అని అన్నారు.



