ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు వైపు నుండి ఎటు వైపుకి తిరుగుతున్నాయి.? ఒక్క ప్రకటన ఎన్ని వివాదాలను సృష్టించగలదు.? ఒకరి సొంత అభిప్రాయం ఎన్ని రాజకీయ చర్చలకు దారి తీయగలదు.? అనే ప్రశ్నలకు ఏపీ రాజకీయాలు ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
తిరుమల లడ్డు వివాదం ఎన్ని రాజకీయ రంగులు పూసుకుందో.? ఇప్పటికి పూసుకుంటుందో అందరు చూస్తూనే ఉన్నారు. అలాగే అంబటి నోటి నుంచి వచ్చిన ఒక్క అనుచిత వ్యాఖ్య ఎంతటి రాజకీయ వివాదానికి తెరతీసిందో కూడా అందరు గమనిస్తూనే ఉన్నారు.
ఇక తాజాగా ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు పంచుకున్న ఒక్క అభిప్రాయం రాష్ట్రంలో రాజకీయ చర్చకు దారితీసింది. తాజాగా కేరళ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం కేరళ రాష్ట్ర పేరుని కేరళంగా మారుస్తూ ఒక ప్రకటన చేసింది.
ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరు మీద చర్చకు దారి తీసింది. ప్రముఖ ఆధ్యాతిక వేత్త, ప్రవచన కర్త గరికపాటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పేరుని కూడా తెలుగు నాడుగా మార్చాలంటూ డిమాండ్ చేసారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సైతం ఏపీని తెలుగు నాడుగా మార్చేందుకు ప్రయత్నించారని, కానీ ఫలితం లేకుండా పోయిందన్నారు.
కానీ ఇప్పుడు కేంద్రం కేరళంగా కేరళ పేరు మార్చడంతో ఆంధ్రప్రదేశ్ పేరును కూడా తెలుగునాడుగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం కేంద్రం పై ఒత్తిడి తేవాలని, అసలు ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు పేరు కాదని, తమిళనాడు తరహాలో ఏపీకి తెలుగునాడు సరిగ్గా సరిపోతుందంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
అయితే మరో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త భువనేశ్వరి పీఠం అధిపతి కమలానంద భారతి గరికపాటి అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ మరోప్రకటన చేసారు. అసలు గరికపాటి తెలంగాణలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ పేరు గురించి మాట్లాడడం వింతగా ఉందని, ప్రతి విషయాన్ని ఎదో ఒక వివాదంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.
పురాతన కాలం నుండి కూడా ఆంధ్రా అనే పదానికి చారిత్రక చరిత్ర ప్రాశస్యం ఉందని, అడిగేవారు లేరు కాదని కొందరు మేధావులని చెప్పుకునే వారు పేరు తో ఇటువంటి ప్రాంతీయవాదాన్ని రెచ్చకొడుతున్నారంటూ కమలానంద భారతి గరికపాటి వ్యాఖ్యల పై తన అసహనాన్ని తెలియచేసారు.







