సినిమాల వాళ్ళకి రకరకాల సెంటిమెంట్స్ ఉన్నట్లే వైసీపీకి కూడా ‘బాబాయ్-అబ్బాయ్’ సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంటుతోనే అది ఏపీలో అధికారంలోకి రాగలిగింది. ఆ సెంటిమెంటుతోనే నేటికీ ఇబ్బందులు పడుతోంది. నెల్లూరులో కూడా బాబాయ్-అబ్బాయ్ సెంటిమెంట్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తున్నట్లుంది.
అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు, మంత్రి అయ్యేందుకు ఆ సెంటిమెంటే ఎంతగానో తోడ్పడింది. అయితే ఇప్పుడు దాంతోనే నెల్లూరు వైసీపీ కంచుకోట బీటలువారుతోంది.
మేయర్ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ పట్టణంలో వేరేగా వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసుకొని అబ్బాయ్పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దాంతో అబ్బాయ్ అనిల్ కూడా బాబాయ్పై ఎదురుదాడి చేస్తూ రచ్చరచ్చచేస్తున్నారు.
ఇప్పటికే నెల్లూరులో ముగ్గురు సీనియర్లు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను బయటకు పంపించేయడంతో జిల్లాలో వైసీపీ బలహీనపడింది. ఇప్పుడు ఈ బాబాయ్-అబ్బాయ్ గొడవతో ఇంకా బలహీనపడితే ప్రమాదమని భావించిన సిఎం జగన్, సోమవారం అబ్బాయ్ని తాడేపల్లికి పిలిపించుకొని క్లాసు పీకిన్నట్లు తెలుస్తోంది.
ఐ-ప్యాక్ ఎర్రసిరాతో మార్క్ చేసిన ఆ 18 మంది ఎమ్మెల్యేలలో అనిల్ కూడా ఒకరని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పనితీరు మెరుగుపరుచుకోమని హెచ్చరిస్తుంటే, బాబాయ్తో గొడవ పెట్టుకొంటూ జిల్లాలో పార్టీకి మరింత నష్టం కలిగిస్తున్నావని సిఎం జగన్ చివాట్లు పెట్టిన్నట్లు తెలుస్తోంది. కనుక బాబాయ్తో సర్ధుకుపోవాలని లేకుంటే టికెట్ కట్ అయిపోతుందని గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపిన్నట్లు తెలుస్తోంది.
అయితే తాడేపల్లిలో కూర్చొని సర్ధుకుపొమ్మని చెప్పడం సులువే కానీ నెల్లూరులో వేర్వేరు కార్యాలయాలు పెట్టుకొన్నాక సర్ధుకుపోవడం సాధ్యమా? కానీ టికెట్ కోసం అబ్బాయ్ అనిల్ సర్ధుకుపోక తప్పదు. అయితే బాబాయ్ కూడా టికెట్ కోసం పోటీ పడుతుంటే ఆయనతో అబ్బాయ్ ఎలా సర్ధుకుపోగలడు?సర్దుకుపోలేకపోతే ఏంటి పరిస్థితి?ఇంతకీ బాబాయ్పై వేటు పడుతుందా అబ్బాయ్ మీదా?



