గ్యాస్ కొరత కారణంగా దేశావ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో హోటల్స్, టిఫిన్ సెంటర్స్, స్వీట్ షాప్స్, బేకరీలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇరాన్-అమెరికా యుద్ధం వలన ఏర్పడిన ఈ గ్యాస్ సంక్షోభం ముగిసేవరకు గృహావసరాలకు మాత్రమే అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి క్రమశిక్షణ చాలా అవసరమే. కానీ హోటల్స్, టిఫిన్ సెంటర్స్ మూతపడితే వాటి యజమానులు, సిబ్బందితో పాటు సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. కానీ గ్యాస్ కొరత మొదలైన తర్వాత దేశవ్యాప్తంగా చాలా హోటల్స్ తాత్కాలికంగా మూతపడ్డాయి.
కొన్ని హోటల్స్, టిఫిన్ సెంటర్స్ యజమానులు కొన్ని ఐటమ్స్ తగ్గించి, మిగిలిన వాటి ధరలు పెంచి నడిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా హోటల్స్, టిఫిన్ సెంటర్స్ మూతపడ్డాయి. లేదా అవే ఆహార పదార్ధాలకు ప్రజలు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోంది.
ఇలాంటి కష్టకాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నాక్యాంటీన్లు నిరుపేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల పాలిట అన్నపూర్ణలా నిలుస్తూ ఆకలి తీరుస్తున్నాయి.
ఈ గ్యాస్ కొరత మొదలైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నాక్యాంటీన్ల వద్ద భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. రోజువారి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, చిరుద్యోగులు, నిరుద్యోగ యువత, ఇతర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చినవారు… చివరికి మూతపడిన టిఫిన్ సెంటర్స్ సిబ్బంది కూడా అన్నాక్యాంటీన్లలో నామ మాత్రపు ధరకే లభిస్తున్న వేడివేడి ఆహారంతో కడుపు నింపుకుంటున్నారు.
అన్నాక్యాంటీన్లు సాదారణ రోజుల్లో ఏవిధంగా పనిచేస్తున్నాయో ఇలాంటి కష్టకాలంలోనూ అలాగే పనిచేస్తుంటాయి. సామాన్య ప్రజల కడుపు నింపుతుంటాయి. వాటి ప్రత్యేకత అదే!
ఇంత చిన్న విషయం అర్థం చేసుకోని జగన్ ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు నాయుడుపై అసూయతో అన్నాక్యాంటీన్లను మూయించేశారు. అదే… వాటన్నిటికీ తన పేరు, తన బొమ్మలే పెట్టుకొని మరింత గొప్పగా నడిపించినా అందరూ హర్షించేవారు కదా?
కానీ వాటిని మూయించేసి చంద్రబాబు నాయుడు పగ, ప్రతీకారం తీర్చుకున్నానని సంతోషపడ్డారే తప్ప పేదలకు అన్నం దొరకకుండా చేశానని గ్రహించలేదు.
అన్నాక్యాంటీన్లు మూయించినందుకు జగన్కి పేద ప్రజల ఉసురు తగిలే ఉంటుంది. ఈ కష్టకాలంలో అవే అన్నాక్యాంటీన్లలో కడుపు నింపుకుంటున్నవారు ‘అన్నదాత సుఖీభవ’ అని సిఎం చంద్రబాబు నాయుడుని ఆశీర్వదించకుండా ఉంటారా?




