రాజకీయాలు రాజకీయాలకు మాత్రమే పరిమితం కావాలి లేదా ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర దేశాభివృద్ధికి ఉపయోగపడాలి. ఇందుకు ఉదాహరణగా ఏపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్లు గురించి చెప్పుకోవచ్చు.
“మా పాలనలో అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్ధి చెందింది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని” చెప్పుకునే ప్రభుత్వాలు రాష్ట్రంలో నేటికీ నిరుపేదలున్నారు. వారు ఆకలితో మాడుతున్నారనే వాస్తవం అంగీకరించడం, ఒప్పుకోవడం, చెప్పుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం వాస్తవమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి 2.10 లక్షల మంది అన్న క్యాంటీన్లలో భోజనాలు చేస్తుండటమే ఇందుకు నిదర్శనం.
కనుక కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించి కేవలం రూ.5లకే కడుపు నిండా అన్నం పెడుతోంది.
సిఎం చంద్రబాబు నాయుడుపై అసూయ, ద్వేషంతో లక్షల కోట్ల విలువ చేసే అమరావతినే పాడుబెట్టిన జగన్, అన్న క్యాంటీన్లని కొనసాగిస్తారనుకోవడం అవివేకమే. కానీ సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచి మంచి పేరు సంపాదించుకోవాలని ఆరాటపడిన జగన్ ఈ అసూయాద్వేషాలకు అతీతంగా ఆలోచించి, తన తండ్రి పేరుతోనో లేదా తన పేరుతోనో అంతకంటే మెరుగుగా నిర్వహింఛి కూడా మంచి పేరు సంపాదించుకోవచ్చు కదా?
కానీ ముందే చెప్పుకున్నట్లు చంద్రబాబు నాయుడుపై అసూయ, ద్వేషంతో వాటిని మూయించేసి, ‘చూశారా నా తడాఖా?’ అన్నట్లు జగన్ వ్యవహరించారు తప్ప వాటిని మూసేస్తే వాటిపై ఆధారపడి జీవిస్తున్న పేద ప్రజల పరిస్థితి ఏమిటని ఆలోచించలేదు. కర్ణుడు చావుకి వంద శాపాలన్నట్లు వైసీపీ ఓటమికి ఇదీ ఓ కారణమైంది.
కానీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో అన్న క్యాంటీన్లని పునరుద్దరించి వాటి సంఖ్యని కూడా పెంచారు. ఇప్పటి వరకు నగరాలు, పట్టణాలకే పరిమితమైన వాటిని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరింపజేస్తున్నారు.
బుధవారం ఒకేరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. వీటితో కలిపి రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల సంఖ్య 269కి పెరుగుతుంది. సిఎం చంద్రబాబు నాయుడు బుధవారం పల్నాడు జిల్లా ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసి, ప్రజలతో కలిసి భోజనం చేస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లపై రాష్ట్ర ప్రభుత్వం రోజుకి రూ.55 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇప్పటి వరకు రూ. కోట్లు 243 కోట్లు ఖర్చు చేసింది.
ఈ గణాంకాలు కాసేపు పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు సిఎంగా ఉన్నప్పుడు కూడా సామాన్య ప్రజల ఆకలి గురించి ఆలోచించారు. మానవతాదృక్పదంతో వారి ఆకలి తీర్చుతున్నారు.
అదే సమయంలో ఈవిధంగా సామాన్య ప్రజలకు మరింత దగ్గరవుతూ తనకు, తన పార్టీకి, ప్రభుత్వానికి కూడా మంచి పేరు సంపాదించుకుంటున్నారని అర్ధమవుతూనే ఉంది.
కనుక రాజకీయాలలో రాణించాలనుకునేవారు అయనని చూసి నేర్చుకుంటారు. కానీ ఆయనని చూసి అసూయ, ద్వేషంతో రగిలిపోయేవారు నేర్చుకోవడానికి అహం అడ్డొస్తుంది కనుక ఆయన ఏం చేస్తే దానిని వ్యతిరేకించడమే విదానంగా మార్చుకొని నష్టపోతుంటారు. బాగుపడేవాడిని ఎవరూ చెడగొట్టలేరు. చెడిపోయే వాడిని ఎవరూ బాగుపరచలేరు.




