స్టాండప్ కామెడీ షోలు ఎంటర్టైన్ చేయడం తక్కువ, కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం ఎక్కువ అన్నట్లు అయిపోయాయి. రీసెంట్ గా సమయ్ అనే స్టాండప్ కమెడియన్ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికల అనవసరంగా సోషల్ మీడియాలో మెగా అభిమానుల తిట్లు కాస్తున్నాడు.
గతేడాది జనవరి 2025లో ఓ స్టేజ్ పెర్ఫార్మెన్స్ లో భాగంగా టాలీవుడ్ ప్రముఖులు మీద కుళ్లు జోకులు వేసి, అక్కడున్న మినిమల్ క్రౌడ్ ని నవ్వించే భగ్న ప్రయత్నం చేశాడు అనుదీప్. అందులో భాగంగా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, బాలకృష్ణ, నిహారిక వంటి సినిమా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ను టచ్ చేశాడు.
నిహారిక డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయడానికి ఫ్యామిలీలో డైవర్సులతో చాలా ఎక్స్ పీరియన్స్డ్ అయిన పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసిందని చేసిన దరిద్రపు కామెడీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో అతడ్ని బండ బూతులు తిడుతున్నారు మెగా ఫ్యాన్స్. అదే సందర్భంలో.. రామ్ చరణ్ కంటే ఉపాసన రిచ్ అని, చరణ్ 200 కోట్ల కోసం సినిమాలు చేస్తున్నాడు.. ఉపాసన లక్ష కోట్ల రూపాయల వ్యాపారాలకి అధినేత అని ఎద్దేవా చేశాడు. ఇక బాలకృష్ణని అభిమానులు ఎవరూ ముఖ్యమంత్రి కావాలని కోరుకోరని.. జైబాలయ్య అనేది ట్రోలింగ్ మాత్రమే అని పనికిమాలిన స్టేట్మెంట్లు పాస్ చేశాడు.
స్టాండప్ కామెడీ పేరుతో స్టార్ల పర్సనల్ లైఫ్ లను టచ్ చేయడం లేదా వాళ్ళను ఎద్దేవా చేయడం అనేది ఎప్పటినుండో చూస్తున్నాం. ఇంతకుముందు “స్పైడర్” రిలీజ్ తర్వాత ఓ తమిళ స్టాండప్ కమెడియన్ ఇదే విధంగా మహేష్ బాబు ఎక్స్ ప్రెషన్స్ పై చేసిన స్టాండప్ కామెడీ మహేష్ అభిమానులకి కోపం తెప్పించడమే కాక, అతడ్ని కొన్నాళ్లపాటు అతడి వృత్తికి దూరంగా ఉంచింది. ఇప్పుడు అనుదీప్ విషయంలోనూ అదే జరగనుంది. అటు మెగా అభిమానులు, ఇటు జన సైనికులు, మరోపక్క బాలయ్య అభిమానులు మరియు తెలుగు తమ్ముళ్లు మూకుమ్మడిగా అనుదీప్ పని పడుతున్నారు. అయితే.. ఎప్పుడో ఏడాది క్రితం చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడం మాత్రం అనుదీప్ దురదృష్టం.
అయినా.. పాపులర్ అవ్వడం కోసం ఇలా స్టాండప్ కామెడీ పేరుతో ఎవరు పడితే వాళ్లు ఇలా స్టార్ హీరోహీరోయిన్ల పర్సనల్ లైఫ్ లను పబ్లిక్ స్టేజుల మీద జోక్ చేయడం అనేది హేయమైనది. ఈ మేటర్ ఎంత దూరం వెళ్తుందో చూద్దాం.




