కాగితాల మీద ఒప్పందాలు భూమ్మీదకి వస్తేనే.. లేకుంటే…

AP’s ₹35 Lakh Crore Investment Claims Under Spotlight

విశాఖలో జరుగుతున్న రెండు రోజుల సీఐఐ సదస్సు నేటితో ముగియనుంది. గడిచిన 18 నెలల్లో రూ.22 లక్షల కోట్లు, ఈ రెండు రోజుల సదస్సు ద్వారా రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు కలిపి మొత్తం రూ.35 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

అయితే ‘ఈ సదస్సు పెట్టుబడులు, ఒప్పందాలు అన్నీ… ఒట్టి డ్రామా’ అని వైసీపీ పదేపదే ఆరోపిస్తూనే ఉంది. కాదని నిరూపించుకోవలసిన బాధ్యత సిఎం చంద్రబాబు నాయుడుపైనే ఉంటుంది.

ADVERTISEMENT

కనుక ఈ ఏడాదిన్నరలో వచ్చిన పెట్టుబడులతో శ్రీసిటీలో ఏర్పాటైన కొన్ని పరిశ్రమలని నేడు విశాఖ సదస్సులో అందరి సమక్షంలో వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు చేశారు.

శ్రీసిటీలో ఐకియా, క్యాడ్ బారీ, డైకిన్, ఇసుజూ వంటి అంతర్జాతీయ కంపెనీలున్నాయని వాటిలో వేలాదిమంది పనిచేస్తున్నారని తెలిపారు.

శ్రీసిటీకి ఇంకా చాలా పరిశ్రమలు వస్తున్నందున మరో 6,000 ఎకరాలు కేటాయించి విస్తరిస్తామని, దేశంలో అత్యుత్తమైన పారిశ్రామిక కేంద్రంగా శ్రీ సిటీని నిలుపుతామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఈ లక్షల కోట్ల విలువగల ఒప్పందాలతో ఈ పరిశ్రమలన్నీ ఏర్పాటయితేనే పదేళ్ళు ఎదురుదెబ్బలు తిన్న ఆంధ్రప్రదేశ్‌కి పూర్తి న్యాయం జరిగినట్లవుతుంది.

కనుక వైసీపీ ఆరోపిస్తున్నట్లు ఒప్పందాలు, ఫోటోలు, సోషల్ మీడియాలో ప్రచారం కంటే, సంతకం పెట్టిన ప్రతీ ఒక్క పరిశ్రమ రాబోయే మూడేళ్ళలో ప్రారంభోత్సవం జరిగేలా చేయాల్సిన బాధ్యత కూడా సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లపైనే ఉంటుంది.

ఈ పరిశ్రమల ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే వాటిని ప్రజలు గుర్తించగలరు. వీటి ద్వారా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడితే, రోడ్లు, ఫ్లై ఓవర్లు వంటి మౌలిక వసతులు కల్పించవచ్చు. అవి కళ్ళకు కనబడతాయి.

వీటి ద్వారా ఆయా ప్రాంతాలలో రియల్ ఎస్టేట్, రవాణా, విద్యా, వైద్య తదితర రంగాలు అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు పెరిగితే వాటినీ ప్రజలు గుర్తించగలరు.

వచ్చే ఎన్నికల నాటికి అమరావతి, పోలవరంతో సహా ఈ మార్పులన్నీ తప్పనిసరిగా ప్రజలకు చూపించినప్పుడే విశ్వసించి మళ్ళీ గెలిపిస్తారు.

కనుక రాబోయే మూడేళ్ళలో ఇంకా ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామనే దాని కంటే, ఈ రూ.35 లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు, డేటా సెంటర్లు వగైరా నూటికి నూరు శాతం ప్రారంభం అయ్యేలా చేయడమే చాలా ముఖ్యం.

లేకుంటే వైసీపీ ‘విశాఖ రాజధాని-రుషికొండ ప్యాలస్‌ కధ’లా మిగిలిపోతే జగన్‌ ఆ అవకాశం సద్వినియోగం చేసుకోకుండా ఉండరు. ప్రజలు కూడా మరోసారి ఆయనతో రిస్క్ తీసుకోవడానికి వెనకాడక పోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories