బీజేపీ మద్దతు రహస్య మిత్రులకా..? అధికారిక పొత్తులకా..?

AP BJP

ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించినట్లు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే ని కానీ ఒక్క ఎంపీ స్థానాన్ని కానీ సాధించలేకపోయినా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకపోయినా, రాష్ట్రానికి భాద్యత గా చేయాల్సిన పనులు చేయకపోయినా అటు అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలు కానీ బీజేపీ అధిష్టానం పై నోరు మెదపడంలేదు.

‘కోరుండి కొరివితో తలగోక్కోవడం’ ఎందుకు అని భావిస్తున్నారో లేక బీజేపీ పెద్దలకు ఎదురెళితే వచ్చే పరిణామాలే ఏమిటో గత ఎన్నికలలో టీడీపీ పార్టీ స్వయంగా అనుభవించింది కాబట్టి ఇక అటువంటి పని చేయడానికి ఏ రాజకీయ పార్టీ సాహసం చేయలేకపోతున్నారేమో అన్నట్లుగా ఏపీ లో పరిస్థితులు మారిపోయాయి.

ADVERTISEMENT

అధికార వైసీపీ మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని కానీ బీజేపీ అధిష్టానాన్ని కానీ పన్నెత్తి మాటకూడా అనడానికి సాహసించదు. కానీ రాష్ట్ర నాయకత్వం మీద మాత్రం కింద స్థాయి నాయకుల నుండి ముఖ్యమంత్రి వరకు ఇష్టానికి నోరు పారేసుకుంటూ ఉంటారు. అలాగే ఏపీలో బీజేపీ అధికార మిత్ర పక్షం జనసేన మాత్రమే. కానీ మిత్ర పక్షం తో కలిసి ఎన్నడూ బీజేపీ ఉమ్మడి కార్యాచరణకు అడుగులు ముందుకు వేయలేదు. కనీసం మిత్రపక్షం పట్ల అధికార పార్టీ అనుసరిస్తున్న నిరంకుశత్వాన్ని ప్రశ్నించనూలేదు.

బీజేపీ అధిష్టానం కానీ, బీజేపీ లో మరేఇతర నాయకులు కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం పై, మిత్ర పక్షమైన జనసేన అధినేత పవన్ పై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించరు, తిరిగి ఆ పార్టీ నేతల మీద ఎదురుదాడి చేయరు. మరి దీని వెనుక ఉన్నఆ మర్మం ఏమిటో, ఆ జగన్నాటకాన్ని తెర వెనుక నుండి నడిపించే సూత్రదారులు ఎవరో 2024 ఎన్నికలకైనా బయటకు వస్తారో లేదో చూడాలి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అడిగి మరి జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఇప్పుడు తెలంగాణలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఒంటరిగా సిద్దమవ్వడం, ఏపీ లో జరగబోయే ఎన్నికలకు ఇంకా పొత్తు విషయం తేల్చకపోవడంతో బీజేపీ ఈసారి కూడా తన రహస్య స్నేహితుడికి మద్దతుగా నిలవనున్నారా..?అనే అనుమానాలు తావిస్తుంది.

బీజేపీ అధినాయకత్వం తన రాజకీయ అవసరాల కోసం ఇలా అధికారికంగా తెర మీద ఒకరితో పొత్తు కొనసాగిస్తూ అనధికారికంగా తెర వెనుక మరొక పార్టీతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ఏ రాజనీతిలో భాగమో చెప్పాలి. జనసేన కూడా బీజేపీ తో పొత్తులో ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో టీడీపీ తో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందంటూ బహిరంగంగానే పొత్తు ప్రకటన చేసారు.

ప్రతిపక్షం లో ఉండి ఇంతవరకు గెలుపు తలుపు తట్టని పవన్ ఇంత ధైర్యంగా పొత్తు ప్రకటన చేస్తే, పదేళ్లనుండి కేంద్ర స్థాయిలో అధికారంలో ఉండి రాష్ట్ర ప్రభుత్వాలను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని దేశాన్ని ఏలుతున్న బీజేపీ కానీ, 175 కి 175 మావే అంటూ విద్యాసంస్థల ర్యాంకుల మాదిరి ప్రకటనలు చేసే వైసీపీ కానీ తమ రహస్య ఒప్పందాలను ధైర్యంగా బయటపెట్ట లేకపోతున్నాయా..?

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారాన్ని చేపట్టినా చివరికి ఆ ప్రభుత్వ మద్దతు తమకే చెందేలా ఇలా అధికారికంగా ఒకరిని అనధికారికంగా మరొకరిని చేరదీస్తూ ఏపీలో బీజేపీ ఆడుతున్న, ఆడిస్తున్న రాజకీయ చదరంగాన్ని ప్రజలు ఎప్పటికి తెలుసుకుంటారో..? ఆ రాజకీయ చదరంగానికి చెక్ ఎప్పుడు పెట్టగలుగుతారో..? అనేది ఓటర్ నొక్కే ఓటు అనే బటన్ లోనే నిక్షిప్తమై ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories