ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు ఉదయం 10.30 గంటలకు శాసనసభలో 2026-27 సం.ల వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సుమారు రూ.3.26 లక్షల కోట్లు ఉండవచ్చని సమాచారం.
గత ఐదేళ్ళ వైసీపీ పాలనతో అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనుకబడిపోయింది. కనుక రాష్ట్ర ఆదాయం గణనీయం పడిపోయింది. పైగా సంక్షేమ పధకాల కోసం వైసీపీ ప్రభుత్వం ఎడాపెడా లక్షల కోట్లు అప్పులు చేసింది. ఆ భారం కూడా కూటమి ప్రభుత్వంపైనే పడింది. ఈ నేపధ్యంలో అమరావతి, పోలవరం వంటి రెండు అతి భారీ ప్రాజెక్టులు ఏకకాలంలో నిర్మిస్తోంది.
కానీ ప్రజలపై అదనపు భారం వేస్తే భరించే పరిస్థితిలో లేరు. కనుక విద్యుత్ బాదుడు కూడా తగ్గించింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులకు తగ్గట్లుగా ఆదాయం పెంచుకోకతప్పదు. కానీ ప్రజలపై భారం వేయకుండా పెంచుకోవడం కత్తిమీద సామే.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ కూడా భారీగా తగ్గించింది. కానీ జీఎస్టీ ఆదాయం పెంచుకోవడం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే జీఎస్టీ వాటాని సకాలంలో రాబట్టుకోవడంపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను ఆన్వేషిస్తోంది. దానిలో భాగంగానే పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తోంది.
దేశంలో ఈ రంగంలో ఉన్న సంస్థలను ఆహ్వానించి విశాఖలో ఓ సదస్సు నిర్వహించింది. రాష్ట్రంలో పర్యాటక ఆకర్షణ కేంద్రాలు, ఈ రంగంలో ఉన్న అవకాశాలను అధికారులు వారికి వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి, పోలవరం నిర్మాణ పనులు వేగవంతం చేసింది. ఈ సమావేశానికి వారి నుంచి మంచి స్పందన వచ్చింది.
అమరావతి, పోలవరం ప్రాజెక్టుని వచ్చే ఎన్నికలలోగా పూర్తి చేస్తామని ప్రభుత్వం పదేపదే చెపుతోంది. కనుక ఈసారి బడ్జెట్లో వాటికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు ఈసారి సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో భారీగా కేటాయించే అవకాశం ఉంది.
శాసనసభ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ వాటిని దృష్టిలో ఉంచుకొని సూపర్ సిక్స్ హామీలకు కూడా బడ్జెట్లో భారీగా కేటాయింపులు జరపబోతున్నట్లు తెలుస్తోంది.
ముందుగా ఈరోజు ఉదయం 10 గంటలకు శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో మంత్రులతో సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలుపుతారు. తర్వాత ఉదయం 10.30 గంటలకు ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. అదే సమయంలో హోంమంత్రి అనిత వంగలపూడి మండలిలో బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఆర్ధిక బడ్జెట్ తర్వాత వ్యవసాయ మంత్రి కింజారపు అచ్చన్నాయుడు శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతారు.






