ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో వైసీపీ గమ్యం లేని ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణంలో వైసీపీ ఇప్పటికి మూడు రాజధానులు అంటూ ఏపీలోని అమరావతి, విశాఖ, కర్నూల్ వరకు ప్రయాణించింది, అయితే తన సుదీర్ఘ గమ్యానికి ఐదేళ్ల సమయం తీసుకున్నప్పటికీ వైసీపీ చివరికి అనుకున్న గమ్యాన్ని చేరలేకపోయింది.
ఆ క్రమంలోనే విశాఖ ఒక్కటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ తమ రాజధాని రూట్ ని విశాఖలోని ఋషి కొండగా నిర్దారించింది. అయితే ఆ గమ్యాన్ని చేరేందుకు కూడా వైసీపీ కి తనవద్ద ఉన్న ఐదేళ్ల సమయం సరిపోలేదు. అలాగే అందుకోసం ప్రజలు కూడా వైసీపీ కి అదనపు సమయం ఇచ్చేందుకు అంగీకరించలేదు.
దీనితో రాష్ట్ర రాజధానిగా అమరావతే అంటూ కేంద్ర ప్రభుత్వం అమరావతి చట్టబద్దత కల్పించడంతో ఇప్పుడు వైసీపీ తిరిగి మావిగన్ తో తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ‘M’మచిలీపట్నం – ‘V’జయవాడ – ‘GUN’టూర్ మూడు ప్రాంతాల పేర్ల నుంచి మొదటి అక్షరాలను తీసుకుని రాజధానిగా మావిగన్ ను ప్రకటించాలంటూ వైసీపీ మావిగన్ తో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.
ఇటువంటి తరుణంలో వైసీపీ మచిలీపట్టణం మాజీ మంత్రి పేర్ని నాని మీడియా ముందుకొచ్చి తమ పార్టీ మునుపటి ప్రయాణాలు రాష్ట్రానికి రాజధానిని అందించలేకపోయాయి కానీ ఇప్పుడు మొదలు పెట్టిన్న మావిగన్ ప్రయాణం ఏపీ రాజధానికి సరైన గమ్యం అంటూ ప్రకటిస్తూనే మరో కొత్త పేరును కూడా ప్రతిపాదించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాష్ట్ర రాజధానిగా మాజీ ముఖ్యమంత్రి జగన్ సూచిన ప్లాన్ బి మావిగన్ పేరు నచ్చకపోతే ఆ పేరు స్థానంలో అయోధ్య అని పెట్టుకోండి కానీ రాజధానిగా మావిగన్ మాత్రమే ఏపీ అభివృద్ధికి బాటలు వేస్తుందంటూ తమ పార్టీకి రాష్ట్ర రాజధాని పట్ల ఉన్న చులకన భావాన్ని, నిలకడ లేని తనాన్ని బయటపెట్టారు.
దీనితో “విశాఖ టూ మావిగన్…మావిగన్ టూ అయోధ్య”… అంటూ వైసీపీ రాజధాని విషయంలో మాటలతో కాలక్షేపం చేస్తూ ముగింపు లేని ప్రయాణం చెయ్యదలచుకుంది అనేది స్పష్టమవుతుంది. జగన్ అమరావతి ని జిల్లాలు దాటిస్తే పేర్ని నాని అయోధ్య అంటూ రాజధానిని రాష్ట్ర సరిహద్దులు దాటించారు.
వైసీపీ ఇక రేపోమాపో రాజధాని పేరును ప్రతిపాదించడానికి దేశ సరిహద్దులు కూడా దాటుతుందేమో చూడాలి. మరి రాజధాని విషయంలో వైసీపీ చేస్తున్న ఈ అంతులేని ప్రయాణానికి ఏపీ ప్రజలు శాశ్వత ముగింపు పలుకుతారా.? లేదా జగన్ ఆశించినట్టు వైసీపీ 2.0 అందిస్తారా.?




