తెలంగాణలో ఊహించని విధంగా ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని గద్దె దింపి ప్రజాపాలన పేరుతో ప్రభుత్వాన్ని స్థాపించిన కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా తన పూర్వ వైభవాన్ని పునః స్థాపించాలనే పట్టుదులతో ముందుకెళ్తున్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటుంది.
తాజాగా అధికార పార్టీ అయిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి జగన్ కు చెక్ పెట్టడానికి వైస్ షర్మిలను ఏపీ రాజకీయ తెర మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. షర్మిల రీ ఎంట్రీ తో రాష్ట్ర విభజనతో ఏపీలో తన అస్తిత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఊపిరి వచ్చినట్లయ్యింది. జగన్ వైఖరి నచ్చని వారికీ, ఆయన నిర్ణయాలతో నష్టపోయిన వారికి, ప్రతిపక్ష పార్టీలలో అవకాశం దక్కించుకోలేని వారికి మరో ప్రత్యామ్నాయంగా మారింది కాంగ్రెస్ పార్టీ.
జగన్ కు నమ్మిన బంటు మాదిరి టీడీపీ పార్టీ పై, బాబు, లోకేష్ పై వివాదస్పద కేసులు వేస్తూ తనను నమ్మి ఓటేసిన ఓటర్లను కూడా జగన్ నిర్ణయం కోసం మోసం చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడా ఇప్పటికే వైస్ షర్మిల వెంట కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించారు. తాజగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లగడపాటి రాజగోపాల్ హర్ష కుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ అయ్యారు.
ఈ భేటీలో పాల్గొన్న ముగ్గురు సీనియర్ నాయకులూ కూడా కాంగ్రెస్ పార్టీ విధేయులుగా వైస్సార్ అనుచరులుగా గుర్తింపు పొందిన వారే కావడంతో వీరి మద్దతు వైస్సార్ కొడుకు జగన్ వైపా..?వైస్సార్ కూతురు షర్మిల వైపా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇలా ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ముగ్గురు ఒక్కసారిగా రాజమండ్రిలో భేటీకావడం వెనుక అనేక రాజకీయ కోణాలు ఉన్నాయంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.
షర్మిల రీఎంట్రీ తో ఈ ముగ్గురు సీనియర్లు కూడా తమ రాజకీయ రీఎంట్రీలకు సిద్దమయ్యారా..? అనే ప్రశ్నలు వినపడుతూన్నాయి. అయితే లగడపాటి మాత్రం తన రీఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేసారు. ఎన్నికల సమయంలో స్థానికంగా ఓటు వేయడం మినహా ఎటువంటి రాజకీయ నిర్ణయాలు తీసుకోబోనంటూ కుండబద్దలు కొట్టారు. తూ..గో..జిల్లాల సాక్షిగా ఏపీ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ మార్చనుందా అనే సందేహాలు మొదలయ్యాయి.
ఉండవల్లి వైస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, నమ్మకస్తుడు అనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికి వైస్సార్ కుటుంబంతో మంచి తత్ససంబందాలు కొనసాగిస్తున్న ఉండవల్లి ఇప్పటి వరకు వైస్సార్ కొడుకు స్థాపించిన వైసీపీ పార్టీకి సానుభూతి పరుడుగా తన రాజకీయ విశ్లేషణలు చేస్తుంటారు. మరి వైస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ తీసుకున్న తరువాత వైసీపీ కి సానుభూతి పరుడిగా కొనసాగుతాడా..?
లేక తనకు ఇన్నాళ్ల రాజకీయ జీవితం ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ వైస్ షర్మిలకు మద్దతుగా నిలబడతారా..?అనేది వేచి చుడాలి. మొత్తానికి రాజకీయ చర్చలలో పార్టీ తరుపున పాల్గొనడానికి కూడా నేతలు కరువైన స్థితి నుంచి పార్టీ కండువా కోసం ఆరాటపడే స్థాయికి ఏపీ కాంగ్రెస్ బాగానే డవలప్ అయ్యింది. మరి ఈ డవలప్ మెంట్ ఏ పార్టీ విజయాన్ని అడ్డుకుంటుందో.? ఏ పార్టీ ఓటమికి సాక్షిగా నిలబడుతుందో కాలమే సమాధానం చెప్పాలి.




