గత నాలుగైదు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూస్తున్న ఇంధన కష్టాలు వాహనదారులను అసహనానికి గురి చేస్తున్నాయి. ఇక నేడు ఆ కష్టాలు తెలంగాణను తాకాయి. దీనితో సమస్య మరింత తీవ్ర రూపంలోకి మారింది.
ఇక వాహనదారులు ఒకపక్క ట్రాఫిక్ రోడ్ల మీద మరోపక్క పెట్రోల్ కోసం బంకుల ముందే తమ సమయం కరిగిపోతుందంటూ ఆందోళన చెందుతున్నారు. చాల ప్రాంతాలలో పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
ఇక స్టాక్ ఉన్న బంకుల ముందు కిలోమీటర్ల మేర వాహనాలు క్యూలు కడుతున్నాయి. క్యూలో ముందు వరుసలో ఉన్నవారి పరిస్థితి ఒక రకంగా ఉంటే వెనుక ఉండే వారికి తమ వంతు వచ్చేసరికి తమ వాహనానికి అవసరమైన ఇంధనం లభిస్తుందా లేదా అన్న భయం వారిని వెంటాడుతుంది.
వాహనదారుల ఇక్కట్లు ఇలా ఉంటే ఇక రొయ్యల చెరువు, చేపల చెరువులు నడుపుతున్న వారి బాధలు మరోలా ఉన్నాయి. ఆక్వా పంటకు అవసరమైన మోటర్ల వినియోగానికి పెట్రోల్ వినియోగం భారీగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో తమకు అవరమైన ఇంధనం సమయానికి అందడం లేదని, తద్వారా తమ చెరువులలో వేసిన రొయ్యలు, చేప పిల్లలు చనిపోతున్నాయంటూ బంకులలో ఆందోళన చేస్తున్నారు ఆక్వా రైతులు.
రోజు రోజుకి ఇంధన సమస్య జటిలంగా మారుతున్న తరుణంలో ప్రభుత్వం చేస్తున్న సమీక్షలు, అధికారులు ఇస్తున్న ఆదేశాలు నామమాత్రంగానే కనిపిస్తున్నాయే తప్ప సమస్య తీవ్రతను తగ్గించలేకపోతున్నాయి. గంటల తరబడి బంకుల ముందు క్యూలో నిలుచున్నా చివరికి వాహనాల్లో ఇంధనం నింపుకుని వెళతాం అన్న నమ్మకం వాహనదారులకు లేకుండా పోతుంది.
సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపించకపోతే ప్రజలలో అసహనం మరింత తీవ్ర స్టేయికి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ప్రతిపక్ష వైసీపీ అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు, ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు గుప్పించేందుకు సిద్దమయ్యింది. సీఎం బాబు సత్వరమే సమస్య తీవ్రతను తగ్గించకపోతే ఇక రోడ్ల మీద ఆందోళనలకు సర్వం సిద్దమవుతాయి.







