డిసెంబర్లో సిఎం జగన్మోహన్ రెడ్డి విశాఖకు మకాం మారుస్తారని, ఋషికొండపై ప్రజాధనంతో ముచ్చటపడి కట్టుకొన్న విలాసవంతమైన భవనంలో ఉంటూ రాష్ట్రాన్ని ఏలుతారని ఒకసారి కాదని మరోసారి వైసీపి నేతలే చెప్పుకొంటున్నారు.
అటువంటప్పుడు విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు తరలించకుండా నిలిపివేయాలని కోరుతూ రాజధాని పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ వేయవలసిన అవసరమే లేదనే చెప్పవచ్చు.
నేడు ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపినప్పుడు ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా ప్రభుత్వ కార్యాలయాలు తరలించడం లేదనే చెప్పారు. పైగా ఈ కేసుని త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేయమని విజ్ఞప్తి చేశారు కూడా. అంటే ఈ కేసుపై వాదనలు వినిపిస్తూ మరో నెలా రెండు నెలలు లాగించేయాలనే ఆలోచన కనబడుతోంది.
అంతేకాదు… తాము విశాఖ రాజధానిని ఏర్పాటు చేసేయాలని మనసులో గట్టిగా ఆలోచిస్తుంటే, ప్రతిపక్షాలు ఆ ఆలోచనలకు కూడా ఇలా అడ్డుతగులుతున్నాయని హైకోర్టు వేదికగా గట్టిగా చాటింపు వేసుకొనే వెసులుబాటు కూడా లభిస్తుంది.
అయినా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నెలనెలా సకాలంలో జీతాలే చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంటే ప్రభుత్వ కార్యాలయాలను, వాటిలో పనిచేసే వేలాదిమంది ఉద్యోగులను విశాఖకు ఎలా తరలించగలదు?అని ఆలోచిస్తే వాస్తవం అర్దమవుతుంది.
కానీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున విశాఖ రాజధాని పేరుతో హడావుడి చేయకపోతే ఉత్తరాంధ్రా ప్రజలకు కూడా వైసీపిపై నమ్మకం పోతుంది. ‘మూడు రాజధానులు పోతే పాయే…కనీసం ఒక్కటైనా ఏర్పాటు చేయలేకపోయిందని’ టిడిపి, జనసేనలు ఎన్నికల సమయంలో గోలగోల చేయకుండా ఊరుకోవు.
కనుక రాష్ట్రం కోసం, ప్రజల కోసం, ఉత్తరాంధ్రా జిల్లాలు జిల్లాల అభివృద్ధి కోసం కాకపోయినా, వైసీపి కోసమైన విశాఖ రాజధాని హడావుడి చాలా అవసరమే. కానీ ఆ హడావుడి చూసి ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరమే లేదు.




