ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11.16 లక్షల మంది దివ్యాంగులు రికార్డులలో నమోదు కాబడ్డారు. కూటమి ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పధకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినప్పుడు తమకు కూడా ఆ పధకం వర్తింపజేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
వారు విజ్ఞప్తి చేయకపోయినా దీని కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తూనే ఉంది… అని నిరూపిస్తూ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ముగ్గురూ కలిసి నేడు గుంటూరు జిల్లా మంగళగిరి ఆర్టీసీ బస్టాండులో ‘దివ్యంగ శక్తి’ పధకాన్ని లాంచనంగా ప్రారంభించారు.
ముగ్గురూ దివ్యాంగులతో కలిసి పల్లెవెలుగు బస్సులో పెనుమాక వరకు ప్రయాణం చేశారు. ముగ్గురూ ఒకే బస్సులో కలిసి ప్రయాణిస్తుండటంతో వారిని చూసేందుకు ప్రజలు, టీడీపి, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
మంగళగిరి బస్టాండ్ వద్ద, బస్సులో వారు ముగ్గురూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, దివ్యాంగుల వద్దకు వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ పధకం గురించి క్లుప్తంగా:
1. ఈ పధకం ద్వారా 11.16 లక్షల మంది దివ్యాంగులు ఇకపై ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించవచ్చు. వారికి సహాయకులుగా మరో 12.76 లక్షల మంది టికెట్ ఛార్జీలో 50 శాతం రాయితీ లభిస్తుంది.
2. కనీసం 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్నవారికి ఈ పధకం వాటిస్తుంది.
3. ఈ పధకం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.207 కోట్లు అదనపు భారం పడుతుంది. ఈ సొమ్ముని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది.
స్త్రీశక్తి పధకం అమలుచేసినప్పుడు ఆ పధకంపై కువిమర్శలు చేసిన వైసీపీ, రాష్ట్రంలో దివ్యాంగులను పట్టించుకోలేదని విమర్శలు గుప్పించింది.
మహిళలకు వర్తించిన ఈ పధకం దివ్యాంగులకు వర్తింపజేయాలంటే ఓ భారీ తతంగమే ఉంది. ముందుగా దివ్యాంగులను గుర్తించాలి. వారికి ఎటువంటి వైకల్యం ఉందో? అది ఎంత శాతం ఉందో… దాంతో వారు ఏ మేరకు బాధపడుతున్నారో గుర్తించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు వినికిడి లోపం ఉన్నవారి కంటే అంధుల సమస్య తీవ్రమైనది. ఇద్దరికీ ఇది పెద్ద సమస్యే కానీ ఆ సమస్య ప్రభావాలు వేర్వేరుగా ఉంటాయి. అలాగే మిగిలిన అంగ వైకల్యాలు కూడా.
కనుక దివ్యాంగులకు ఇలాంటి పధకాలు వర్తింపజేయాలంటే ఇవన్నీ వైద్యులు, అధికారులు పరిశీలించి, గుర్తింపు కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. అలా కార్డులు పొందినవారికి ఎప్పటి నుంచో ప్రయాణ ఛార్జీలలో 50 శాతం రాయితీ ఉంది. ఇప్పుడు 100 శాతం రాయితీ లభిస్తోంది.
స్త్రీశక్తి పధకంపై విమర్శలు గుప్పించిన వైసీపీకి కూటమి ప్రభుత్వం ఈ పధకంతో బాగానే జవాబు చెప్పింది. కానీ ఇప్పుడు ఈ పధకంపై కూడా వైసీపీ విమర్శించకుండా ఉంటుందా?




