కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సత్సంబందాలుంటే…

AP Railway Project

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలకు అతీతంగా ఆయా రాష్ట్రాల అవసరాలను కేంద్ర ప్రభుత్వం పలు అభివృద్ది పనులు చేపడుతుంటుంది.

సత్సంబంధాలు లేకపోయినా అభివృద్ధి పనులు జరుగుతాయి. కానీ నత్త నడకన సాగవచ్చు. లేదా ప్రతిపాదనలకే పరిమితం కావచ్చు.

ADVERTISEMENT

అదే.. సత్సంబంధాలున్నట్లయితే అభివృద్ధి పనులు మరింత వేగంగా సాగుతాయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జోరుగా సాగుతున్న రైల్, రోడ్, జాతీయ రహదారుల నిర్మాణ పనులను గమనిస్తే అర్ధమవుతుంది.

ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రూ.9,889 కోట్లతో (198 కిమీ) నిడదవోలు-దువ్వాడ రైల్వే స్టేషన్ల మద్య కొత్తగా మరో రెండు రైల్వే లైన్లు నిర్మించేందుకు ఆమోదముద్ర వేశారు.

రైల్వేమంత్రి అశ్విన్ వైష్ణవ్‌ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ఈ రెండు ప్రాంతాల మద్య ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్లను వాటి సామర్ధ్యానికి మించి అంటే 130 శాతం ఉపయోగించుకుంటున్నాము. దీని వలన తరచూ ప్యాసింజర్ రైళ్ళ రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. కనుక కొత్తగా మరో రెండు లైన్లు నిర్మించాలని నిర్ణయించాము.

ఈ రెండు రైల్వే లైన్ల నిర్మాణంలో భాగంగా గోదావరి నదిపై కొత్తగా 4.3 కిమీ రైల్వే వంతెన నిర్మిస్తాము. ఇది కాక మరో మూడు అతిపెద్ద రైల్వే వంతెనలు, 58 పెద్ద వంతెనలు, 416 చిన్న వంతెనలు కూడా నిర్మిస్తాము.

ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం ఉన్న రైల్వే మార్గం సుమారు 8కిమీ దూరం తగ్గేవిధంగా అలైన్మెంట్ కూడా చేస్తాము.

ఇవి పూర్తయి అందుబాటులోకి వస్తే వీటితో విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, గంగవరం పోర్టులకు రైల్వే కనెక్టివిటీ ఏర్పడుతుంది.

అలాగే విశాఖ-అనకాపల్లి-విజయవాడ మద్య ఇప్పటికే ఉన్న మరియు కొత్తగా ఏర్పాటవుతున్న స్టీల్ ప్లాంట్‌, ధర్మల్ విద్యుత్ కేంద్రం, సిమెంట్ ప్లాంట్లకు అవసరమైన ముడి సరుకు రవాణాకు వెసులుబాటు పెరుగుతుంది.

ఈ ప్రాంతాల నుంచి ఆహార ధాన్యాలు, పళ్ళు రవాణాకు, అలాగే ఈ మార్గం గుండా బాక్సైట్, సున్నపు రాయి, జిప్సం వంటి ఖనిజాలు దేశంలో ఇతర రాష్ట్రాలకు రవాణాకు మరింత వెసులుబాటుగా ఉంటుంది.

అన్నవరం, ద్రాక్షారామం, అంతర్వేది వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు మరింత కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ ప్రాజెక్టుని రాబోయే 5 ఏళ్ళలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము,” అని చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories