సహజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎక్కువగా కుల ప్రభావిత రాజకీయాలు అనేది జగమెరిగిన సత్యమే. అయితే కాలానుగుణంగా తెలంగాణలో కూడా ఈ కుల రాజకీయాల విష సంస్కృతీ చాప కింద నీరులా విస్తరిస్తుంది.
ఏపీలో కుల రాజకీయాలు పార్టీల పొత్తులు – ఎత్తులతో ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూ ముందుకు సాగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ కు గుత్తాధిపత్యంగా ఉన్న కాపు ఓటింగ్ వైసీపీ రాకతో, కాంగ్రెస్ పతనంతో రెండుగా చీలింది.
అయితే వైసీపీ – టీడీపీ మధ్య లో జనసేన ఆవిర్భవించడంతో ఏపీలో మరోసారి కాపు కుల సమీకరణలు మారాయి. జనసేన ముందు నుంచి వైసీపీ కి వ్యతిరేకమే, అయితే టీడీపీ తో సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, బాబు కున్న పాలనానుభవం దృష్ట్యా, ఆయన విజనరికి పవన్ జై కొట్టారు, టీడీపీ తో పొత్తు కుదుర్చుకున్నారు.
దీనితో ఏపీలో ఉన్న కాపు సామాజిక ఓటింగ్ టీడీపీ కి అదనపు బలాన్ని చేకూర్చింది. బాబు తో పవన్ మైత్రి గతంలో ఈ ఇరు సామజిక వర్గాల మధ్య ఉన్న విద్వేషాన్ని కొంతవరకు చెరపగలిగింది. దాని ఫలితమే 164 సీట్లతో కూటమి ఘన విజయం, 11 సీట్ల వైసీపీ ఘోర ఓటమి.
అయితే ఏపీలో కుదిరిన ఈ కమ్మ + కాపు కుల సమీకరణ కూటమికి పట్టం కడితే, తెలంగాణలో ఒక్కటైనా కమ్మ + రెడ్డి కుల సమీకరణ కాంగ్రెస్ ను అందలం ఎక్కించింది. అయితే ఇక్కడ ఈ కుల సమీకరణ ఏర్పాటుకు పార్టీలు అతీతం కాగా నాయకులు కీలకం అయ్యారు.
రేవంత్ రెడ్డి సామాజికవర్గం పరంగా చూసుకుంటే ఆయన రెడ్డి సామాజికవర్గమే అయినప్పటికీ ఆయనకు టీడీపీ తో ఉన్న ఏళ్లనాటి అనుబంధం, బాబు తో తనకున్న బంధం ఆయనను కమ్మ సామజిక వర్గానికి దగ్గర చేసింది. రేవంత్ మా వాడు, మా పార్టీ మనిషి అనే భావన ఇప్పటికి చాలామంది టీడీపీ మద్దతుదారులలో, కమ్మ సామాజికవర్గ సభ్యులలో బలంగా పాతుకుపోయింది.
ఆ బలమే రేవంత్ ను తెలంగాణ ముఖ్యంమత్రిగా నిలబెట్టింది, జూబ్లీహిల్స్ వంటి బలమైన, కీలకమైన నియోజకవర్గంలో రేవంత్ నాయకత్వాన్ని బలపరిచింది, కాంగ్రెస్ కు పట్టం కట్టయింది.
అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఏపీలో బాబు ఓటమికి శ్రమించే ‘రెడ్డి’ సామాజికవర్గం తెలంగాణలో టీడీపీ సానుభూతిపరుడైన రేవంత్ నాయకత్వాన్ని బలపరుస్తుంది. అలాగే ఏపీలో వైసీపీ ఓటమిని కాంక్షించే ‘కమ్మ’ సామాజికవర్గం తెలంగాణలో రెడ్డి సామాజికవర్గమైన రేవంత్ రెడ్డి గెలుపుకి బాటలు వేస్తుంది.
తెలంగాణలో రెడ్డి సామాజికవర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు కేటీఆర్ ఎంతలా శ్రమిస్తున్నా, అందుకు వైసీపీ బలంగా పరోక్ష మద్దతు ఇస్తున్నా బిఆర్ఎస్ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు మాదిరే కనిపిస్తున్నాయి. అలాగే అటు రేవంత్ రెడ్డి తో బాబుకి ఉన్న సాన్నిహిత్యం బలమైనదే అయినప్పటికీ ఏపీలో రెడ్డి సామాజికవర్గం ఓట్లను వైసీపీ కి దూరం చెయ్యలేకపోతున్నాయి.
దీన్ని బట్టి చూస్తే ఇరు రాష్ట్రాల రాజకీయంలో కులం, కుల సమీకరణాలు కీలక పాత్రే పోషిస్తున్నప్పటికీ అవి పార్టీల ఆధారంగా, నాయకుల ప్రామాణికంగా రూపం మార్చుకుంటూ ఏపీలో కమ్మ +కాపు , తెలంగాణలో కమ్మ + రెడ్డి అన్నట్టుగా మారిపోయాయి. అయితే రెండు రాష్ట్రాల రాజకీయాలలో కమ్మ సామాజికవర్గం పాత్ర కీలకం కావడం ఇక్కడ విశేషం.






