పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులని చెప్పింది వైసీపీ నాయకులే. అదే నోటితో విశాఖ రాజధాని చాలన్నారు. ఇప్పుడు మావిగన్ అంటున్నారు. అంటే వారి వాదనలకు వారే కట్టుబడి ఉండటం లేదన్న మాట!
నాడు మూడు రాజధానులు, విశాఖ రాజధాని అంటున్నప్పుడు వీటిపై మీ వైఖరి ఏమిటో చెప్పాలని టీడీపిని నిలదీస్తుండేవారు. అవునని చెప్తే మా వాదన కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. కాదని చెప్తే ఆయా ప్రాంతాల ప్రజలను టీడీపికి వ్యతిరేకంగా రెచ్చగొట్టవచ్చు. కానీ టీడీపి వారి ఉచ్చులో చిక్కుకోలేదు.
మళ్ళీ ఇప్పుడు ‘మావిగన్’తో అదే గేమ్ మొదలుపెట్టారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ, “మీరు (టీడీపి)మావిగన్ అనే పేరుకి వ్యతిరేకమా లేదా ఆ మూడు ప్రాంతాలకు వ్యతిరేకమా? చెప్పాలి.
గతంలో మూడు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆయా రాష్ట్రాలలో ప్రధాన నగరాలను రాజధానిగా చేసుకున్నాయి తప్ప ఇల్లా పార్లమెంటులో బిల్లు పెట్టించి చట్ట బద్దత కల్పించుకోలేదు. ఎందువల్ల?” అని ప్రశ్నించారు.
ఎందువల్ల అంటే, ఆయా రాష్ట్రాలలో వైసీపీ వంటి వితండవాదనలు చేసే పార్టీ లేదు కనుక. ఒకవేళ ఉన్నా మూడు రాజధానులు వంటి విచిత్రమైన ఆలోచనలు చేసే నేతలు లేనందునే అని చెప్పుకోవాల్సి ఉంటుంది.
అమరావతి పేరుతో అవినీతికి పాల్పడుతున్నందునే సిఎం చంద్రబాబు నాయుడు చట్ట బద్దత కల్పించుకున్నారంటూ గుడివాడ మరో విచిత్రమైన వాదన వినిపించారు. అయితే అవినీతికి పార్లమెంట్ చట్టబద్దత కల్పిస్తుందా? అని సందేహం కలుగుతుంది.
నాడు మూడు రాజధానులు, విశాఖ రాజధాని, ఇప్పుడు ‘మావిగన్’ పేరుతో ఇలాంటి రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేతలు, రేపు ఎన్నికలలో ఆయా ప్రాంతాల ప్రజలకు ఏం చెప్పుకొని ఓట్లు అడగాలి? అప్పుడు ప్రజల స్పందన ఏవిధంగా ఉంటుంది? అని ఆలోచించగలిగితే ఇలాంటి మాటలు మాట్లాడేవారే కారు!






