వైసీపీ..బిఆర్ఎస్ కవలలా.?

YCP BRS Parties

కవలలు అంటే ఒకరికి నొప్పి తగిలితే మరొకరి కంట్లో నుంచి నీళ్లు కారుతాయి, ఒకరికి ఆనందం వస్తే మరొకటి పెదవుల మీద చిరునవ్వు చిందుతుంది అనేలా సినిమాలలో దృశ్యాలను చూస్తూ ఉంటాం.

సేమ్ అదే తీరుగా ఇక్కడ ఏపీ లో వైసీపీ, అక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ రెండు కూడా కవల పిల్లల మాదిరి ప్రవర్తిస్తున్నాయి. ఏపీలో వైసీపీ కి కష్టం వస్తే తెలంగాణలో బిఆర్ఎస్ కలత చెందుతుంది, తెలంగాణలో బిఆర్ఎస్ కు నష్టం జరిగితే ఏపీలో వైసీపీ కి కలవరం మొదలవుతుంది.

ADVERTISEMENT

2023 ఎన్నికలలో తెలంగాణలో బిఆర్ఎస్ ఓడిపోయింది, 2024 ఎన్నికలలో ఏపీలో వైసీపీకి పరాజయం తప్పలేదు. అలాగే ఎన్నికలకు ముందు వైసీపీ కి షర్మిల రూపంలో చెల్లెల గండం ఎదురైతే, బిఆర్ఎస్ కు ఎన్నికల తరువాత కవిత రూపంలో ఆ గండం గుమ్మం ముందుకొచ్చి నిలబడింది.

ఇక వైసీపీ తనకొచ్చిన ఒక్క ఛాన్స్ తో ప్యాలస్ పాలన చేస్తే, బిఆర్ఎస్ తన పదేళ్ల అధికారంతో ఫామ్ హౌస్ ప్రభుత్వాన్ని నడిపింది. ఇలా రెండు పార్టీల అధినేతలు ప్రజలకు దూరంగా, పార్టీ నాయకులకు కనిపించకుండా తమ అధికారాన్ని ప్రతిపక్ష పార్టీల వినాశనం కోసం వెచ్చించారు.

అయితే ఇక్కడ ఈ రెండు పార్టీల రాజకీయ శత్రువు కూడా ఒక్కరే కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అటు తెలంగాణలో గులాబీ కారుకి ఇటు ఏపీలో బులుగు ఫ్యాన్ కి తెలుగు దేశం సైకిల్ ఉమ్మడి శత్రువు కాగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వారిద్దరి పార్టీల ప్రధమ రాజకీయ ప్రత్యర్థి అయ్యారు.

ఇక ఏపీలో వైసీపీ గెలుపు కోసం, జగన్ ముఖంలో ఆనందం కోసం జగన్ సొంత చెల్లెలు వైస్ షర్మిల ఫోన్ కూడా టాపింగ్ చేసే దుస్సాహసానికి బిఆర్ఎస్ దిగజారితే, బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం కోసం జగన్ సొంత రాష్ట్ర ప్రయోజనాలను సైతం ఒక్క సంతకంతో తెలంగాణకు సొంతం చేసేందుకు వెనుకాడలేదు.

అలాగే వైసీపీలో అవినీతి పరులంతా అందగాళ్ళు, సౌమ్యులు గా మారితే, బిఆర్ఎస్ లో దోపిడీ దారులంతా రాష్ట్ర పరిరక్షకులుగా, సంక్షేమ యోధులుగా మారిపోయారు. ఇక అటు బిఆర్ఎస్ డ్రగ్స్ కేసు, ఫోన్ టాపింగ్ వివాదాలతో సినీ పరిశ్రమను తన గుప్పెట్లోకి తెచ్చుకుంటే, ఇటు వైసీపీ టికెట్ రేట్ల తగ్గింపు, సెలబ్రెటీల రెమ్యునరేషన్ అంటూ టాలీవుడ్ ను తాడేపల్లి ప్యాలస్ వరకు రప్పించింది.

ఇక తాజాగా రెండు పార్టీల శ్రేణులు వారి పార్టీల అధినేత మెప్పు కోసం కోసం “రప్ప రప్ప నరుకుతాం” అంటూ పుష్ప సినిమా డైలాగ్స్ తో కూడిన పోస్టర్ లను ప్రదర్శనకు తెచ్చారు. ఈ విషయంలో కూడా రెండు పార్టీల రాజకీయం ఒక్కటే అన్నట్టుగా నిరూపణ జరిగింది.

అలాగే సత్తెనపల్లి పర్యటనలో భాగంగా జగన్ కారు కింద పడి ఒక వ్యక్తి చనిపోయిన ఘటన లో ఇటు వైసీపీ సోషల్ మీడియా ఏ స్థాయిలో జగన్ ను డిఫెండ్ చేస్తుందో అలాగే అటు తెలంగాణలో బిఆర్ఎస్ సోషల్ మీడియా కూడా అదే స్థాయిలో జగన్ కు మద్దతుగా వైసీపీ కి అండగా నిలుస్తూ వీడియోలను పోస్ట్ చేస్తుంది.

అంటే వైసీపీ కి కష్టం వస్తే, జగన్ కు ఇబ్బంది కలిగితే వైసీపీ కి సమాన స్థాయిలో బిఆర్ఎస్ కూడా వైసీపీ అరాచకాలకు మద్దతు తెలుపుతుంది. అలాగే అటు బనకచర్ల విషయంలో ఏపీ పై బిఆర్ఎస్ చేస్తున్న వివాదస్పద రాజకీయం పై వైసీపీ, బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా రాష్ట్రానికి అనుకూలంగా ఒక్క ప్రకటన చెయ్యడానికి ఆసక్తి చూపడం లేదు.

ఇక ఏపీ రాజధాని అమరావతి విషయంలో కూడా ఈ రెండు పార్టీల ఆలోచన సరళి ఒక్కటిగానే కనిపిస్తుంది. ఇలా ఈ రెండు పార్టీలు ఒకరి కోసం ఒకరు, ఒకరికి ఒకరు అన్నట్టుగా కవల పిల్లల మాదిరి ఏపీ విధ్వంసానికి కంకణం కట్టుకున్నారు. మరి ఈ ఇద్దరి మధ్య బంధం ఏపీ కి ఇంకెన్ని కొత్త కష్టాలను తెచ్చిపెడుతుందో.? ఏపీలో మరెన్ని రాజకీయ విభేదాలను సృష్టిస్తుందో.? చూడాలి.

ADVERTISEMENT
Latest Stories