తమిళనాట డీఎండీకే వర్గాల్లో గుబులు పుట్టించిన వార్త ఇది. మాజీ సిల్వర్ స్క్రీన్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్, ఆయన భార్య ప్రేమలతలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలని తిరుప్పూర్ కోర్టు వారెంట్ ను జారీ చేయడం పార్టీ వర్గాలను ఆందోళనలో ముంచివేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై విచారణకు రానందుకు కోర్టు వారెంట్ ను జారీ చేసింది.
గత ఎన్నికల ప్రచారంలో ‘అమ్మ’ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేయడంతో, ప్రభుత్వ న్యాయవాది సుబ్రమణియన్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేసిన న్యాయమూర్తి నటరాజన్, గతంలోనే విజయకాంత్ దంపతులకు సమన్లు జారీ చేసినప్పటికీ, వాటిని ఖాతరు చేయలేదు. దీంతో పర్యవసానాలు మరింత ముదిరి వారెంట్ వరకు దారి తీసింది. వర్తమాన రాజకీయాలు పార్టీకి అనుకూలంగా లేకపోవడంతో తమ నేతలను ఎప్పుడు అరెస్ట్ చేస్తారోనన్న ఆందోళన డీఎండీకే వర్గాల్లో వ్యక్తమవుతోంది.
కాగా, రాష్ట్రంలోని పలు కోర్టుల్లో వీరిద్దరి పైన పరువు నష్టం దావా కేసులు నమోదై, విచారణ దశలో ఉన్నాయి. తమిళనాట ఈ రివెంజ్ రాజకీయాలు దేశ రాజకీయాలకు సుపరిచితమే. గతంలో కరుణానిధి వర్సెస్ జయలలిత ఎపిసోడ్స్ ఎప్పుడూ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన వైనం రాజకీయ విజ్ఞులకు విదితమే. అయితే ఈ సారి ఫోకస్ విజయకాంత్ వైపుకు మళ్లిందని చెప్పుకుంటున్నారు. గడిచిన ఎన్నికలలో డీఎండీకే పార్టీని ప్రజలు తీవ్రంగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. పోటీ చేసిన 104 స్థానాలలో విజయకాంత్ తో సహా అందరూ ఓటమి పాలై తీవ్ర భంగపాటుకు గురయ్యారు.



