2001లో భారత పార్లమెంటుపై దాడి చేసిన పాకిస్తాన్, మరోసారి అలాంటి తరహా దాడి చేసేందుకే కుట్ర జరుగుతోందా? అవుననే అంటున్నాయి ఇంటెలిజెన్స్ నివేదికలు. భారత సైన్యం సర్జికల్ దాడుల నేపథ్యంలో పరువు పోగొట్టుకున్న పాకిస్థాన్… ప్రతీకారం తీర్చుకునేందుకు తహతహలాడుతోంది. ఈ క్రమంలోనే, భారత పార్లమెంటుపై దాడి చేయించే యోచనలో ఐఎస్ఐ ఉందని… దీని కోసం ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ సాయం కోరినట్టు ఇంటెలిజెన్స్ అధికారులు జారీ చేసిన హెచ్చరికలు నిర్ధారిస్తున్నాయి.
ఐఎస్ఐ కోరడంతో… పార్లమెంటుపై దాడికి జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ప్రణాళికలు రచిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీనికి కోసం మానవ బాంబును ఉపయోగించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపాయి. ఒకవేళ పార్లమెంటుపై దాడి చేయడం సాధ్యం కాకపోతే… అక్షరధామ్, లోటస్ టెంపుల్, ఢిల్లీ సెక్రటేరియట్ లపై దాడి చేయవచ్చని అధికారులు తెలిపినట్టు సమాచారం. మరోవైపు, జనాభా ఎక్కువగా ఉన్న మార్కెట్లలో కూడా మానవ బాంబు ద్వారా రక్తపుటేరులు పారించాలనే సూచనలు కూడా జైష్ ఆపరేటివ్స్ కు ఉన్నాయని తెలుస్తోంది.



