ఒకప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకున్నవారిని సమాజంలో ప్రతీ ఒక్కరూ చాలా గౌరవంగా చూసేవారు. కానీ రాన్రాను అయ్యప్పదీక్ష తీసుకున్నవారిలో కొందరు చేయకూడని తప్పులు, అపచారాలు చేస్తుండటంతో మిగిలిన భక్తులందరికీ కూడా చెడ్డపేరు వస్తోంది. ఇందుకు ఇదో చిన్న ఉదాహరణ.
అనకాపల్లి జిల్లా పాయకరావు పేటకు చెందిన వైసీపీ ప్రచార విభాగం అధ్యక్షుడు దగ్గుపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో కొందరు వైసీపీ కార్యకర్తలు దీక్ష తీసుకున్నారు. అందరూ కలిసి శబరిమలకు వెళ్ళే మార్గంలో ఇరుముడి నెత్తిన పెట్టుకొని కాలినడకన నడుస్తున్నారు.
అప్పుడు భక్తులు ఎవరైనా ‘స్వామియే… శరణం అయ్యప్ప’ అంటూ అయ్యప్ప స్వామిని ప్రార్ధిస్తూ ముందుకు సాగుతుంటారు. కానీ వైసీపీ భక్తులు అయ్యప్ప నామం జపిస్తూనే మద్యలో ‘జై జగన్’ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.
అంతేకాదు… జగన్ 2.0 ఫోటో ఉన్న పోస్టర్స్ ప్రదర్శిస్తూ ముందు సాగారు. అది చూసి మిగిలిన భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నావారు పట్టించుకోలేదు. ‘జై జగన్’ అని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.
ఇదే పెద్ద అపచారమనుకుంటే, సాక్షి మీడియా ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టి, “అభిమానమంటే ఇది కదా?’ అంటూ వారి ‘జగన్ భక్తిని’ ప్రశంశించింది. వారు అందరినీ ఆకర్షిస్తున్నారంటూ మెచ్చుకుంది.
జగన్ హయంలో తిరుమల, సింహాచలం పుణ్యక్షేత్రాలలో ఎన్ని అపచారాలు జరిగాయో అందరికీ తెలుసు. ఇప్పుడు పొరుగు రాష్ట్రం కేరళలో కూడా అయ్యప్పస్వామి పట్ల అపచారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నారు. ఇందుకు సిగ్గుపడాల్సి ఉండగా సాక్షి మీడియా మెచ్చుకుంటోంది!






