శ్రీకాకుళం జిల్లాలో టిడిపి ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి అధ్వర్యంలో సోమవారం పారాపురం, కొత్తూరులో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు ఇంటింటికీ వెళ్ళి సంక్షేమ పధకాల పేరుతో వైసీపీ ప్రభుత్వం ఏవిదంగా ప్రజలపై భారం వేస్తోందో వివరించి వాటికి సంబందించిన కరపత్రాలను పంచిపెట్టారు. ఒక్కో పధకానికి నిధులు విడుదల చేసినప్పుడల్లా ప్రభుత్వం ఛార్జీలు పెంచడం పరిపాటిగా మారిపోయిందని, ఆర్టీసీ బస్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు.
సంక్షేమ పధకాల గురించి గొప్పగా చెప్పుకొంటున్న వైసీపీ ప్రభుత్వం, వాటిని కూడా గుట్టుగా కుదించేస్తోందని వారు ప్రజలకు వివరించారు. ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే అంతమంది చదువుకోవడానికి అమ్మఒడి పధకాన్ని వర్తింపజేస్తామని మొదట చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఇంట్లో ఒక్క విద్యార్ధికి మాత్రమే ఇస్తుండటం నిజమా కాదా? అని గ్రామస్తులనే అడిగి తెలుసుకొన్నారు. అలాగే అమ్మఒడి పధకంలో అర్హులను తగ్గించడానికి ప్రభుత్వం అనేక ఎత్తులు వేస్తోందని వారు ప్రజలకు వివరించారు.
మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి నిర్వాసితుల సమస్యలపై మాట్లాడుతూ, “వైసీపీ అధికారంలోకి వస్తే 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మరికొంత సొమ్ము చేతిలో పెట్టి మమ అనిపించేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్, శ్రీకాకుళం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు మెండ దాసునాయుడు, మండల తెలుగు యువత అధ్యక్షుడు చింతాడ కోటేశ్వరరావు, టిడిపి నేత పాత్రకొండ మోహన్ రావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
విజయనగరంలో టిఎన్ఎస్ఎఫ్ నిరసనలు
నూతన విద్యావిధానం పేరుతో ఉపాధ్యాయుల కుదింపు, పాఠశాలలను మూసివేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధుల తల్లితండ్రులు, ప్రజలు, ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గకపోవడంతో తెలుగుదేశం పార్టీ అనుబంద టిఎన్ఎస్ఎఫ్ కూడా రంగంలోకి దిగింది.
విజయనగరంలో టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పతివాడ తారక రామనాయుడు అధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో పేద విద్యార్దులు విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉందని, కనుక ప్రభుత్వం తక్షణం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.



