కరడుగట్టిన నేరగాళ్ళు, అవినీతిపరుల చేతిలో పదవి, అధికారం ఉంటే ఎలా ఉంటుందో కర్ణాటకలో బళ్ళారి పట్టణంలో బుధవారం రాత్రి జరిగిన ఘర్షణలు కళ్ళకు కట్టినట్లు చూపాయి.
ఓ వైపు మైనింగ్ కింగ్, గంగావతి బిజేపి ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి అనుచరులు… మరోవైపు స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు… ఫ్లెక్సీ బ్యానర్ వంకతో ఇరు వర్గాలు మందు బాటిల్స్, రాళ్ళతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. అంతటితో ఆగలేదు. ఇద్దరు ఎమ్మెల్యేలు తమ గన్ మ్యాన్ల వద్ద తుపాకులు తీసుకొని పరస్పరం కాల్పులు జరుపుకున్నారు.
ఓ వైపు పట్టణంలో ప్రజలు సంతోషంగా నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటుంటే, ఎమ్మెల్యేలు గాలి జనార్ధన్ రెడ్డి, భరత్ రెడ్డి పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. బళ్ళారిలో గాలి జనార్ధన్ రెడ్డి నివాసం ముందు ఇరు వర్గాల మద్య దాదాపు అర్ధ గంటపై ఈ యుద్ధం కొనసాగింది.
ఈ ఘర్షణలలో పోలీసులతో సహా పలువురు తీవ్రంగా గాయపడగా, రాజశేఖర్ అనే కాంగ్రెస్ కార్యకర్త బుల్లెట్ తగిలి ఘటనా స్థలంలోనే చనిపోయాడు.
ఈ గొడవని ప్రారంభించిన ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి ఎదురు కాల్పులలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో అంబులెన్సులో బెంగళూరులోని ఓ హాస్పిటల్కి తరలించారు.
ఫ్లెక్సీ పేరుతో గొడవ పెట్టుకొని తనని హత్య చేసేందుకే ఎమ్మెల్యే భరత్ రెడ్డి కుట్ర చేశారని బిజేపి ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఆరోపించారు.
బళ్ళారిలో వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపనకు మేము ఏర్పాట్లు చేసుకుంటుంటే, సహించలేక మమ్మల్ని అడ్డుకునేందుకే గాలి జనార్ధన్ రెడ్డి తమపై దాడులు చేయించి హత్య రాజకీయాలు చేశారని ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఆరోపించారు.
వారి అనుచరులు గొడవ పడుతున్నప్పుడు ఈ విషయం తెలుసుకొని ఎమ్మెల్యేలు ఇద్దరూ అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యేలిద్దరూ తమ అనుచరులను శాంతింపజేయకపోగా, తమ గన్ మ్యాన్ వద్ద తుపాకులు తీసుకొని పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో పరిస్థితి చెయ్యి దాటిపోయింది.
వారిలో భరత్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకాగా, గాలి జనార్ధన్ రెడ్డి బిజేపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి. కనుక పోలీసులు వారిని అడ్డుకునేందుకు సాహసించలేకపోయారు.
కానీ ఇరు వర్గాలు కాల్పులు జరుపుకోవడం మొదలుపెట్టడంతో పరిస్థితి చెయ్యి దాటిపోతోందని గ్రహించి పోలీసులు కూడా గాల్లో కాల్పులు జరిపి, లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
బళ్ళారిలో నేడు కర్ఫ్యూ విధించి భారీగా పోలీసులను మొహరించారు. గాలి జనార్ధన్ రెడ్డితో సహా మొత్తం 11 మందిపై బ్రూస్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ప్రజా ప్రతినిధులుగా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన గాలి జనార్ధన్ రెడ్డి, భరత్ రెడ్డి తుపాకులతో కాల్పులు జరుపుతూ మాఫియా గ్యాంగ్ లీడర్లలా వ్యవహరించడం చాలా శోచనీయం.
నడిరోడ్డుపై తుపాకులతో కాల్పులు జరుపుకున్నా వారిపై కేసులు నమోదు చేయడమే తప్ప చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేని నిసహాయత పోలీసులది. ఆటవిక రాజ్యం అంటే ఇదేగా?






