తెలంగాణ బిజేపిలో ఓ సామాన్య కార్యకర్త స్థాయి నుండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్థాయికి ఎదగడం మామూలు విషయం కానే కాదు. ఆ స్థాయికి చేరుకున్న బండి సంజయ్ ఇప్పుడు కుమారుడు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదవడంతో అందరి ముందు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది.
ఈ కేసులో అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ జరిపేలోగా పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
ఈ కేసులో పూర్వపరాలు, చివరికి ఏం జరుగుతుందనే విషయాలు కాసేపు పక్కన పెడితే, జెన్-జీ తరానికి ప్రతినిధులైన బండి భగీరథ్, మైనర్ బాలిక గురించి నాలుగు ముక్కలు చెప్పుకోవాల్సి ఉంటుంది.
బండి భగీరథ్: తన తండ్రి అనేక దశాబ్దాల పాటు కష్టపడి ఆ స్థాయికి చేరుకున్నారని, అయనకు రాష్ట్రంలో, పార్టీ అధిష్టానం వద్ద చాలా గౌరవమర్యాదలు పొందుతున్నారని, ఈవిధంగా తనని వెనకేసుకు వస్తున్నందుకు తండ్రి రాజకీయ జీవితం కూడా నాశనం అవుతుందని బండి భగీరథ్ గ్రహిస్తే ఈవిధంగా వ్యవహరించేవాడే కాదు. తన వలన తల్లి తండ్రులు తలదించుకునేలా చేసేవాడు కాదు.
ఒకవేళ సినిమాలలో చూపుతున్నట్లు ‘నేను మంత్రి కొడుకుని కనుక ఏం చేసినా చెల్లుతుందనుకొని’ ఉండవచ్చు. ఆ ధైర్యమే ఉన్నట్లయితే, నిజంగా ఏ తప్పు చేయకపోయుంటే, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్ళే బదులు నేరుగా పోలీస్ స్టేషన్కి పోలీసుల విచారణకు హాజరయ్యి ఉండేవాడు. కానీ ఇలా తప్పటడుగులు వేసి ఈ కేసులో చిక్కుకొని తల్లితండ్రుల గౌరవ మర్యాదలు, ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడు.
మైనర్ బాలిక: అమ్మాయిలు, అబ్బాయిలు స్నేహంగా ఉండటం తప్పు కాదు. కానీ ఆ స్నేహం హద్దులు దాటి ఫామ్హౌసు వరకు వెళ్తే ఇలాంటి సమస్యలలో చిక్కుకుంటారని ఈ కేసు చెపుతోంది.
ఎంత చెట్టుకి అంత గాలన్నట్లు వీరిద్దరి వలన కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్కి, మధ్యతరగతి కుటుంబానికి చెందిన మైనర్ బాలిక తల్లితండ్రుల గౌరవ మర్యాదలకు భంగం కలుగుతోంది.
ఇద్దరూ తప్పటడుగులు వేసి చిక్కులో చిక్కుకున్న తర్వాత ఇప్పుడు తల్లితండ్రుల మీద ఈ భారం వేశారు. వారు చేసిన తప్పుల వలన రెండు కుటుంబాలు సమాజంలో నవ్వుల పాలవుతున్నాయి. వారి కుటుంబ పెద్దలు తల దించుకోవాల్సి వస్తోంది. పోలీసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తోంది. న్యాయపోరాటాలు చేయాల్సివస్తోంది!
ప్రపంచంలో వీరిద్దరు మాత్రమే కాదు… నేటి తరంలో యువతలో చాలా మంది ఇలాంటి తప్పులు చేస్తున్నారు. అలాగని యువత అందరూ ఇలాగే ఉంటారని కాదు. కూలి పనులు చేసుకునేవారి పిల్లలు పట్టుదలగా చదివి ప్రభుత్వోద్యోగాలు సంపాదించుకుంటున్నారు. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులవుతున్నారు కదా?
కానీ చదువుకొనే వయసులోనే చాలా మంది పబ్బులు, ఫామ్హౌసు పార్టీలు, ఆ వయసులోనే బ్రేకప్ల వరకు వెళ్ళిపోతున్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నించాల్సిన ఈ వయసులో ఇలాంటి తప్పటడుగులు వేస్తూ ఇలాంటి సమస్యలలో చిక్కుకొంటూ, తల్లితండ్రులకు ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారు. దారి తప్పి హత్యలు, ఆత్మహత్యలు చేసుకునేవారు కోకొల్లలున్నారు.
కనుక వీరిద్దరి కేసు జెన్-జీ తరంలో ఇలా తప్పటడుగులు వేస్తున్న యువతకి కనువిప్పు కలిగిస్తుందని ఆశిద్దాం.






