కేసీఆర్‌పై కేసులు అందుకే అటకెక్కాయట!

Bandi Sanjay Kumar

రేవంత్‌ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కాగానే ఏదో ఓ రోజు కేసీఆర్‌ని జైలుకి పంపించడం ఖాయమనే అందరూ భావించారు. ఓటుకి నోటు కేసులో రేవంత్‌ రెడ్డిని కేసీఆర్‌ జైలుకి పంపించడమే కాకుండా, కూతురు పెళ్ళి చేయడానికి బెయిల్‌పై బయటకు వచ్చినప్పుడు దానిలో పూర్తిగా పాల్గొననీయకుండా చాలా ఇబ్బంది పెట్టారు. అప్పుడే రేవంత్‌ రెడ్డి శపధం చేశారు.

ఏనాటికైనా కేసీఆర్‌ని ఓడించి, అదే జైలులో చిప్ప కూడు తినిపిస్తానని శపధం చేశారు. చెప్పిన్నట్లుగానే కేసీఆర్‌ని ఓడించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో సహా అనేక కేసులు విచారణ జరిపిస్తున్నారు. కనుక ఏదో ఓ కేసులో కేసీఆర్‌ని జైలుకి పంపించడం ఖాయమనే అందరూ అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు అటకెక్కిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు వగైరాల విచారణ అంతూపొంతూ లేకుండా సాగుతూనే ఉంది.

ADVERTISEMENT

కేసీఆర్‌, కేటీఆర్‌ ఇద్దరినీ జైలుకి పంపిస్తానని శపదం చేసిన రేవంత్‌ రెడ్డి హటాత్తుగా ఎందుకు చల్లబడిపోయారు? అంటే దానికి కేంద్రమంత్రి బండి సంజయ్‌ సమాధానం చెప్పారు.

ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “హర్యానా, జమ్మూ కశ్మీర్‌ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి డబ్బు పంపినది కేసీఆరే. అందువల్లే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు అటకెక్కిపోయింది. కేసీఆర్‌ కాంగ్రెస్‌ ఎన్నికల ఖర్చులకి డబ్బు ఇవ్వలేదని ఆయన కానీ రేవంత్‌ రెడ్డి గానీ చెప్పగలరా?

ఆ కేసులో కేసీఆరే సూత్రధారి అని అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు అందరూ చెపుతున్నా కేసీఆర్‌కి కనీసం నోటీస్‌ ఎందుకు ఇవ్వడం లేదు? అంటే కారణం ఇదే. కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల మద్య ఈ రహస్య అవగాహన, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నందునే ఆ కేసు అటకెక్కిపోయింది,” అని బండి సంజయ్‌ సంచల ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన కేటీఆర్‌ మీద కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “కేటీఆర్‌ అహంకారం కారణంగానే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కేటీఆర్‌ వల్లనే కేసీఆర్‌కి, బిఆర్ఎస్ పార్టీకి ఈ గతి పట్టింది,” అని విమర్శించారు.

కాంగ్రెస్‌, బీజేపీలని అడ్డుపెట్టుకొని కేసీఆర్‌ డబుల్ గేమ్స్ ఆడబట్టే ఆయన విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారింది.

ఆయనకి మోడీకీ మద్య రహస్య అవగాహన ఉందని అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు నుంచి కల్వకుంట్ల కవిత బయటపడగలిగిందని కాంగ్రెస్‌ వాదిస్తోంది.

కానీ తనపై రేవంత్‌ రెడ్డి పెట్టిన కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్‌ ఎన్నికల ఖర్చులు ముట్టజెప్పారని ఇప్పుడు బండి సంజయ్‌ ఇప్పుడు మరో కొత్త విషయం బయటపెట్టారు.

కేసీఆర్‌ అహంకారం వలననే బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయిందని అందరూ భావిస్తుంటే, ఆయన కేటీఆర్‌ అహంకారం వలన నష్టపోయారని బండి సంజయ్‌ కొత్త విషయం చెపుతున్నారు.

అంటే రాజకీయాలలో విశ్వసనీయత కోల్పోయినా, అహంభావం ప్రదర్శించినా చివరికి ఏమవుతుందో కేసీఆర్‌, బిఆర్ఎస్ పార్టీలే ఓ చక్కటి నిదర్శనమని బండి సంజయ్ చెపుతున్నారని అనుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories