మింగ మెతుకు లేదు… కానీ మీసాలకు సంపంగె నూనె కావాలన్నట్లుంది బంగ్లాదేశ్-పాకిస్తాన్ తీరు. పాలకులు భారత్పై ద్వేషంతో తమ దేశాన్ని ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్గా మార్చేసుకున్నారు. దానికి తోడు పాలకులు, సైన్యాధ్యక్షుల అవినీతి, యుద్ధకాంక్ష, ప్రభుత్వంపై సైనిక పెత్తనం వంటివి పాకిస్తాన్కి శాపంగా మారాయి.
తీవ్ర ఆర్ధిక సమస్యలతో బాధ పడుతున్న పాకిస్తాన్కి సౌదీ అరేబియా, కొన్ని గల్ఫ్ దేశాలు, చైనా, అమెరికా, ఐఎంఎఫ్ అందిస్తున్న ఆర్ధిక సాయం అందిస్తున్నాయి. వాటితో ఎలాగో నెట్టుకొస్తోంది.
మరోపక్క బంగ్లాదేశ్లో ఇటీవల ప్రజా తిరుగుబాటు జరిగి ప్రభుత్వం కూలిపోయింది. అప్పుడు ఆ దేశాధ్యక్షురాలు షేక్ హసీనా భారత్ పారిపోయి వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. నేటికీ అల్లర్లు, లూటీలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి.
బంగ్లాదేశ్ సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ పరిస్థితి ఇంచుమించు ఒకేలా ఉందన్న మాట!
ఇలాంటి పరిస్థితి బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి యుద్ధ విమానాలు కొనుగోలుకి ఒప్పందం చేసుకోవడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది.
బంగ్లాదేశ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దానికి యుద్ధ విమానాలు దేనికి?ఎవరితో యుద్ధం చేయడానికి?అంటే భారత్ అని అనుకోవాల్సి ఉంటుంది. కానీ బలమైన వైమానిక దళం ఉన్న పాక్నే భారత్ చిత్తుచిత్తు చేసింది కదా?బంగ్లాదేశ్ భారత్తో తలపడగలదా? అంటే కాదనే అర్ధమవుతోంది.
చైనా సహకారంతో తయారు చేస్తున్న యుద్ధ విమానాలను బంగ్లాదేశ్కి అమ్ముకొని ఆర్ధిక సమస్యల నుంచి బయట పడగలమని పాకిస్తాన్ అనుకుంటోంది. ఈ ఒక్క రక్షణ ఒప్పందంతో పాక్ ఆర్ధిక సమస్యలని బంగ్లాదేశ్ తీర్చేయగలదా? అంటే కాదనే అర్ధమవుతోంది. ముష్టిలో వీర ముష్టి అంటే ఇదేనేమో?
గతంలో పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ ఏర్పాటుకు భారత్ సాయపడింది. కానీ ఇప్పుడది భారత్ని కాదని నాడు తమని చాలా దారుణంగా హింసించి అణచివేసిన పాకిస్తాన్తో స్నేహానికి, రక్షణ ఒప్పందాలకు బంగ్లాదేశ్ సిద్ధం అవుతుండటం చాలా విడ్డూరంగా ఉంది.






