నేడు భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అయినప్పుడు మొదట సిఎం చంద్రబాబు నాయుడు తర్వాత మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన రావడం ఆశ్చర్యం కలిగించదు. దీని కోసం సిఎం చంద్రబాబు నాయుడు 2015లో సన్నాహాలు మొదలుపెట్టి 2019లో దిగిపోయే నాటికి భూసేకరణ, కేంద్ర ప్రభుత్వ అనుమతులు వంటి క్లిష్టమైన పనులు పూర్తిచేసి శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టించారు.
కానీ ఆయనపై ద్వేషం చేత లేదా విమానాశ్రయం పనులు పూర్తిచేసి ప్రారంభిస్తే ఆ క్రెడిట్ ఆయనకు దక్కుతుందనే అసూయతోనో లేదా సంక్షేమ పధకాలు, రాజకీయ కక్షలు తప్ప మరేదీ ముఖ్యం కాదనుకోవడం వల్లనో భోగాపురం విమానాశ్రయాన్ని నాలుగున్నరేళ్ళు పట్టించుకోలేదు.
కానీ తాను వద్దనుకున్న, అవసరం లేదని వాదించిన ఆ విమానాశ్రయానికే జగన్ స్వహస్తాలతో మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టించారు. అంటే తన ఆలోచన, ధోరణి రెండూ తప్పని, సిఎం చంద్రబాబు నాయుడి ఆలోచన, నిర్ణయం రెండూ సరైనవని జగన్ ఒప్పుకున్నట్లే కదా?
భోగాపురం విమానాశ్రయం చూపించి ఉత్తరాంద్ర ప్రజలను జగన్ ఓట్లు అడగాలనుకున్నారు. అంటే అభివృద్ధికే ప్రజలు ఓట్లు వేస్తారని జగన్ గ్రహించినట్లే కదా? కానీ ఒక్క ఛాన్స్ విలువ తెలుసుకోలేక వృధా చేసుకున్నారు.
అయితే జగన్ ఈ ఒక్క ఛాన్స్ మాత్రమే మిస్ చేసుకున్నారా? అంటే కానే కాదు. ప్రజలు ఆయనకు ‘ఒక్క ఛాన్స్’ ఇస్తే అనేక ఛాన్సులు మిస్ చేసుకున్నారు.
ఆ జాబితాలో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్రంలో ఇతర సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన ఇలా చాలా పెద్ద జాబితాయే ఉంది. వీటిలో ఏ ఒక్క దానిని పూర్తిచేసి చూపినా ప్రజలు జగన్కు జేజేలు పలికేవారు. మళ్ళీ అధికారం అప్పగించేవారు కదా?
కానీ ఇన్ని అవకాశాలను జగన్ చేజార్చుకున్నారు. కారణం చంద్రబాబు నాయుడుపై అసూయ ద్వేషం, తన రాజకీయ కోర్కెలు, ఆలోచనలనే ప్రజల ఆకాంక్షలుగా భావిస్తూ అరాచకపాలన చేయడమే!
జగన్ 5 ఏళ్ళ పాలనలో కనీసం మెడికల్ కాలేజీల నిర్మాణాలు లేదా విశాఖ నగరాభివృద్ధి చేసి చూపినా చెప్పుకోవడానికి ఏదో ఒకటి కనబడేది. కానీ వీటన్నిటినీ కాదని రుషికొండపై విలాసవంతమైన ప్యాలసులు, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకో పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు.
అంటే జగన్ రాష్ట్రాభివృద్ధికి బదులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే భావన ఆయనే స్వయంగా ప్రజలకి కలిగించారు. దానికి భారీ మూల్యం చెల్లించారు.
కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో సిఎం చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. అందుకే అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే అమరావతి, పోలవరం పనులకు జగన్ వేసిన బ్రేకులు తొలగించి యుద్ధ ప్రాతిపదికన పనులు జరిపిస్తున్నారు.
అలాగే రాష్ట్రాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పరిశ్రమలు, ఐటి కంపెనీలతో ఉద్యోగాల కల్పనపై దృష్టి సారింఛి పనులు చేయిస్తున్నారు.
జగన్ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా భోగాపురం విమానాశ్రయం నిర్మించలేకపోయారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే తొలి విమానం ల్యాండ్ చేయించారు.
ఈ ఒక్కటే జగన్ అసమర్దత, నిర్లక్ష్యానికి, వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తుంటే ఇదే విమానాశ్రయం సిఎం చంద్రబాబు నాయుడు సమర్ధత, నిబద్దత, పట్టుదలకి నిదర్శనంగా నిలుస్తోంది కదా?
జగన్ ‘ఒక్క ఛాన్స్’ విలువ అర్థం చేసుకోలేక చేతిలో ఉన్న అనేక ఛాన్సులను వదులుకున్నారు. సిఎం చంద్రబాబు నాయుడు ‘రెండో ఛాన్స్’లో ఉన్న ప్రతీ చిన్న అవకాశాన్ని నూటికి నూరు శాతం వినియోగించుకుంటున్నారు. ఇద్దరికీ ఇదే తేడా!






