కొన్ని కట్టడాలు కూడా ఓ ప్రభుత్వం సమర్దతకి, మరికొన్ని ఆసమర్దతకి నిదర్శనంగా కనిపిస్తుంటాయి. అమరావతిలో 39, 47 అంతస్తులతో నిర్మించబోతున్న 5 ఐకానిక్ టవర్స్ కూటమి ప్రభుత్వం సమర్ధతకి నిదర్శనం అనుకుంటే విశాఖ రుషికొండని చెక్కేసి రూ.500 కోట్ల ప్రజాధనం ఖర్చుచేసి జగన్ నిర్మించుకున్న విలాసవంతమైన ప్యాలస్లు అవినీతికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం నిలిచి ఉన్నాయి.
ముంబయి, నవీ ముంబయిని కలుపుతూ సముద్రంపై ఓ అద్భుతమైన వంతెన, జమ్ము కశ్మీర్లో ప్రపంచంలోకెల్లా ఎత్తైన రైల్వేలైన్ రెండు అద్భుతాలు.
అలాగే అహ్మదాబాద్ నుంచి ముంబయి వరకు నిర్మిస్తున్న బుల్లెట్ రైలు కారిడార్లో సుమారు 1.3 కిమీ పొడవునా సముద్రం అడుగు నుంచి సొరంగ మార్గంలో సాగబోతోంది. ఇది పూర్తయితే మరో మహాద్భుతం ఆవిష్కారమవుతుంది.
దేశంలో ఇంత అత్యద్భుతమైన, భారీ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ఏదీ అసాధ్యం కాదనిపిస్తుంది. కనుక నగరంలో భూమిపై ఓ ఫ్లై ఓవర్ నిర్మించడం గొప్ప విషయమా? అంటే కాదనే చెప్పాలి.
మధ్యప్రదేశ్, భోపాల్ నగరంలో కూడా అటువంటి అద్భుతమైన ఫ్లై ఓవర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని నిర్మాణం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. సామాన్య ప్రజలు సైతం నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఏమిటి దాని గొప్పదనం? అంటే ఫ్లై ఓవర్ మలుపుని 90 డిగ్రీల కోణంలో నిర్మించడం వల్లనే!
ఎక్కడైనా ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నప్పుడు వాటిపై వాహనాలు వేగంగా దూసుకుపోయేందుకు వీలుగా మలుపు ఉన్న చోట చక్కటి వంపుతో నిర్మిస్తుంటారు.
కానీ భోపాల్ నగరంలో ఐష్ బాగ్ అనే ప్రాంతంలో నిర్మించిన ఫ్లై ఓవర్ (రైల్ ఓవర్ బ్రిడ్జి)ని 90 డిగ్రీల కోణంలో నిర్మించేశారు!
అదేదో రాత్రికి రాత్రి పూర్తయ్యే పని కాదు.. ప్రభుత్వం, కాంట్రాక్ట్ కంపెనీ, అధికారులు, ఇంజనీర్ల పర్యవేక్షణలో నెలల తరబడి దీని నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కనుక ఈ ఇంజనీరింగ్ లోపం మీడియాతో సహా ఎవరి దృష్టి నుంచి తప్పించుకోలేదు. కానీ తప్పించుకుంది.
నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత కానీ మధ్య ప్రదేశ్ ప్రభుత్వం మేల్కోలేదు!
ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు, ఏడుగురు ఇంజనీర్లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే గుత్తేదారు కంపెనీని, ఈ ఫ్లై ఓవర్కి ఇటువంటి డిజైన్ ఇచ్చిన కన్సల్టెన్సీ సంస్థని బ్లాక్ లిస్టులో పెడుతున్నట్లు ప్రకటించారు.
అయితే ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం డిజైన్ చూడకుండానే అధికారులు, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి నిధులు విడుదల చేసిందా?అంటే అవుననే అనుకోవాలి. కనుక ప్రభుత్వం పనితీరు ఏవిదంగా ఉందో అర్దం చేసుకోవచ్చు.




