శోభానాగిరెడ్డి అకాల మృత్యువుతో ఒక్కసారిగా రాజకీయాల్లోకి వచ్చిన కూతురు భూమా అఖిల్ ప్రియ ఇటీవల తెలుగుదేశం పార్టీలోకి మారుతూ ఇచ్చిన ప్రసంగం రాజకీయ వర్గాలను విశేషంగా ఆకట్టుకుంది. అతి తక్కువ సమయంలోనే రాజకీయాలను బాగానే ఒంటపట్టించుకుందని టాక్ తెచ్చుకున్న భూమా అఖిల్ ప్రియ తాజాగా పలు మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలలో వర్తమాన రాజకీయాలపై, తన పొలిటికల్ కెరీర్ పై అభిప్రాయాలు తెలిపింది.
“భూమా నాగిరెడ్డి ప్యాకేజీలకు అమ్ముడుపోయే వ్యక్తి కాదని, భూమా కుటుంబం ప్యాకేజీలకు గానీ, పదవులకు గానీ అమ్ముడుపోతే 20 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండేది కాదని, 20 ఏళ్లుగా నియోజకవర్గంలో విజయం సాధించినప్పటికీ చేయాల్సింది ఎంతో ఉందని, ప్రతిపక్షంలో ఉన్నప్పటి కంటే, అధికార పక్షంలో ఉంటే అభివృద్ధికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని, పార్టీ మారడం అన్నది తన తండ్రి, తాను కలిసి తీసుకున్న నిర్ణయంగా” చెప్పుకొచ్చారు.
“పార్టీ మారుతున్న సంగతి కనీసం తన మామ ఎస్వీ మోహన్ రెడ్డికి కూడా చెప్పలేదని, తప్పు చేశామని భావిస్తే తాము ముందుకు అడుగు వేయమని, తమదంతా ఉమ్మడి కుటుంబం అని, వారసత్వం అందరికీ చెందుతుందని, అనుకోని సందర్భాలలో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందే తప్ప, తనకు ట్రావెలింగ్ ఇష్టమని చెప్పిన అఖిల్ ప్రియ, తన తమ్ముడు, చెల్లికి రాజకీయాలంటే బాగా ఇష్టమని, తన తల్లిని ఆదరించినట్టుగానే ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు తనను కూడా అపూర్వంగా ఆదరిస్తున్నారని, వారికి ఏదైనా చేయాలన్న తపనతో ఉన్నానని” అఖిల్ ప్రియ పలికిన వ్యాఖ్యలు పొలిటికల్ వర్గాలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.



