ఆళ్ళగడ్డ టిడిపి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈరోజు ఉదయం హటాత్తుగా నంద్యాలలో విజయ డైయిరీ ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ గోడపై జగన్, వైఎస్ఆర్ ఫోటోలు ఉండటం చూసి ప్రభుత్వం మారినా ఇంకా మీరు మారలేదంటూ డెయిరీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్షణం ఆ ఫోటోలు తీసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్ధకశాఖ మంత్రి అచ్చన్నాయుడు ఫోటోలు పెట్టాలని అంతవరకు తాను అక్కడి నుంచి కదలనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందుకుంటూ ప్రోటోకాల్ పాటించరా?అని ఆమె నిలదీశారు.
సిబ్బంది వెంటనే సిఎం చంద్రబాబు నాయుడు ఫోటో తీసుకువచ్చి పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు ఫోటో సిద్దంగా ఉన్నప్పటికీ దానిని పక్కన పెట్టేసి మాజీ సిఎం జగన్, వైఎస్సార్ ఫోటోలు పెట్టుకున్నారని స్పష్టమవుతోంది.
రాష్ట్రంలో ప్రభుత్వం మారి నాలుగు నెలలు అవుతున్నా ఇంకా జగన్ ఫోటోలు పెట్టుకోవడం గమనిస్తే వారు జగన్ విధేయులని అర్దమవుతోంది.
విజయా డైరీ ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి తన కార్యాలయంలో తన మేనకోడలు భూమా అఖిలప్రియా చేస్తున్న ఈ హడావుడి గురించి తెలుసుకొని ఫోన్ చేసి ఆమెపై ఫైర్ అయ్యారు. ఆమె కూడా ఆయనకు ఘాటుగా సమాధానం చెప్పారు.
తాను మేనకోడలుగా రాలేదని ఓ ఎమ్మెల్యేగా మీ కార్యాలయానికి వచ్చానని, ప్రోటోకాల్ పాటించకపోగా అమర్యాదగా మాట్లాడుతున్నారని ఇది సహించబోనని భూమా అఖిలప్రియ ఆయనకి వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడూ అందరూ తనని చూసి భయపడి వినయ విధేయతలతో మెసులుకోవడమే తప్ప తనకే ఈవిదంగా వార్నింగ్ ఇచ్చేవారు ఎదురుపడకపోవడంతో ఎస్వీ జగన్మోహన్ రెడ్డి కూడా ఆగ్రహంతో రగిలిపోయారు.
కానీ తన కార్యాలయంలో జగన్, వైఎస్సార్ ఫోటోలు పెట్టుకొని ఆమెకు అడ్డంగా దొరికిపోయారు కనుక ఏమీ చేయలేకపోయారు.
మళ్ళీ తాను ఎప్పుడు వచ్చినా గోడపై సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి అచ్చన్నాయుడు ఫోటోలు కనబడాలని లేకుంటే తగు చర్యలు తీసుకోవలసి వస్తుందని భూమా అఖిలప్రియ ఎస్వీ జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు.




