మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకురాలు అఖిలప్రియను బుదవారం తెల్లవారుజామున నంద్యాలలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే, ఆమె వర్గానికి చెందిన ఓ కార్యకర్త, టిడిపి సీనియర్ నేత ఏవి.సుబ్బారెడ్డిని కొట్టినందుకట! నంద్యాల టిడిపిలో భూమా అఖిలప్రియ, ఏవి.సుబ్బారెడ్డి వర్గాల మద్య చాలా కాలంగా విభేధాలున్నాయి.
టిడిపి యువనేత నారా లోకేష్ శ్రీశైలం నియోజకవర్గంలో పాదయాత్ర ముగించుకొని మంగళవారం సాయంత్రం నంద్యాల నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామంలో ప్రవేశిస్తుండటంతో ఇరు వర్గాలు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు పోటాపోటీగా భారీ ఏర్పాట్లు చేసుకొన్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల కార్యకర్తల మద్య చిన్న ఘర్షణ జరిగినప్పుడు భూమా అఖిలప్రియ అనుచరుడు ఏవి.సుబ్బారెడ్డి ముక్కుపై కొట్టడంతో రక్తం కారింది. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే ఇరువర్గాలను చెదరగొట్టి, ఆయనను హాస్పిటల్కు తీసుకువెళ్ళి ప్రధమ చికిత్స చేయించారు. కనుక అక్కడితో ఈ సమస్య ముగిసింది. కానీ పోలీసులు ఇందుకు భూమా అఖిలప్రియను బాధ్యురాలిని చేసి, ఆళ్ళగడ్డలోని ఆమె నివాసం నుంచి ఈరోజు ఉదయం అరెస్ట్ చేసి నంద్యాలకు తీసుకువెళ్ళారు.
నియోజకవర్గంలో భూమా అఖిలప్రియ, ఏవి.సుబ్బారెడ్డి వర్గాల మద్య చాలా కాలంగా విభేధాలున్నాయనే సంగతి వైసీపీ నేతలకి కూడా తెలుసు. ఒకవేళ పోలీసులు కేసు నమోదు చేయదలిస్తే ఘర్షణ పడిన ఇరు వర్గాల కార్యకర్తల మీద కేసు నమోదు చేయాలి. లేదా సుబ్బారెడ్డిపై దాడి చేసిన కార్యకర్తను అరెస్ట్ చేసి ఉండాలి. ఒకవేళ ఈ ఘర్షణకు వారి నాయకులే కారణమని భావిస్తున్నట్లయితే అఖిలప్రియతో పాటు ఏవి.సుబ్బారెడ్డిని కూడా అరెస్ట్ చేసి ఉండాలి. కానీ ఆమెను మాత్రమే అరెస్ట్ చేసి నారా లోకేష్ వెంట పాదయాత్ర చేసే అవకాశం లేకుండా చేసి, ఏవి.సుబ్బారెడ్డికి పరోక్షంగా తోడ్పడిన్నట్లు అర్దమవుతోంది.
ఇది తెలివిగా వారిద్దరి మద్య చిచ్చు మరింత రాజేయడమే అని అర్దమవుతూనే ఉంది. టిడిపిని దెబ్బ తీసేందుకు వైసీపీ కాసుకు కూర్చోందని తెలిసి ఉన్నా టిడిపి నేతలు ఈవిదంగా కీచులాడుకొని వైసీపీ ఉచ్చులో చిక్కుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.



