కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉందిప్పుడు. అత్యంత కీలకమైన బీహార్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఘోరంగా ఓడిపోబోతోంది.
మొత్తం 243 స్థానాలకు బీజేపి-జేడీయు (ఎన్డీయే) 200 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతుండగా కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి కేవలం 38 స్థానాలలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జన్ సూరజ్ పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కనీసం 2-5 సీట్లు తప్పకుండా గెలుచుకుంటుందని సర్వేలు చెప్పగా, ఒక్క సీటు కూడా దక్కడం లేదు.
ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఊహించినట్లే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అదీ అనూహ్యంగా 24,658 ఓట్ల మెజార్టీతో గెలవడం గొప్ప విషయమే! కాంగ్రెస్ పార్టీకి 79,634, బీఆర్ఎస్ పార్టీకి 57962, బీజేపికి 14,243 ఓట్లు పడ్డాయి.
కనుక కాంగ్రెస్ పార్టీ కీలకమైన బీహార్ ఎన్నికలలో ఓడిపోయినందుకు కన్నీళ్ళు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించినందుకు ఆనంద భాష్పాలు తప్పదు.
అందరికీ శకునం చెప్పిన బల్లి కుడితిలో పడి చచ్చిందన్నట్లు కాంగ్రెస్, బీజేపి, వైసీపీలతో అనేక పార్టీలను తిరుగులేని మెజార్టీతో గెలిపించిన ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ తన సొంత రాష్ట్రం బీహార్లో సొంత పార్టీ జన్ సూరజ్ ఒక్క సీటు కూడా గెలిపించుకోలేకపోయారు. బీహార్ ప్రజల మనసులు అర్ధం చేసుకోవడంలో విఫలం అయ్యానని ప్రశాంత్ కిషోర్ అన్నారు.






