మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఫిభ్రవరి 18న అమరావతికి వచ్చి సిఎం చంద్రబాబు నాయుడుతో ముఖాముఖి సమావేశం కానున్నారు. గత ఏడాదే విద్య, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ రంగాలలో ఏఐ ఆధారిత శిక్షణ, సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దానిని కార్యాచరణలోకి తెచ్చేందుకే బిల్ గేట్స్ తన బృందంతో సహా అమరావతికి వస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు ఆయనని కలిసేందుకు చంద్రబాబు నాయుడుతో సహా దేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అమెరికా వెళ్ళి వస్తుండేవారు. నేటికీ ఆయన అపాయింట్మెంట్ దొరికితే చాలనుకునే వారు కోకొల్లలున్నారు. అలాంటి ప్రముఖ వ్యక్తి బిల్ గేట్స్ తనంతట తానే అమరావతికి వచ్చి సిఎంతో భేటీ కాబోతుండటం అంతర్జాతీయంగా కూడా చంద్రబాబు నాయుడుకి ఎంత పరపతి ఉందో తెలియజేస్తోంది.
సిఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో క్వాంటం వ్యాలీ… దానిలో క్వాంటం కప్యూటింగ్ వ్యవస్థని ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ రంగంలో మైక్రోసాఫ్ట్ కంపెనీకి కూడా మంచి అనుభవం, ఆసక్తి రెండూ ఉన్నాయి. కనుక అమరావతి క్వాంటం వ్యాలీలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపడం సహజం.
ఒకవేళ బిల్ గేట్స్-సిఎం చంద్రబాబు నాయుడు సమావేశంలో ఈ ఒప్పందం ఖరారైతే అమరావతికి అంతర్జాతీయ ఐటి కంపెనీలు క్యూ కడతాయి. కనుక ఈ నెల 18న బిల్ గేట్స్-సిఎం చంద్రబాబు నాయుడు సమావేశం చాలా కీలకమైనది. రాష్ట్ర భవిష్యత్ని పెద్ద మలుపు తిప్పినా ఆశ్చర్యం లేదు.






