ఏపీలో పొత్తులపై బిజెపికి స్పష్టత వచ్చేసినట్లేనా?

Narendra_Modi_Amit_Shahఇంతకాలం గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్న బిజెపి అధిష్టానానికి ఏపీలో పొత్తులపై స్పష్టత వచ్చేసినట్లేనా?అంటే అవుననే అనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఆ పార్టీ సీనియర్ నేత సునీల్ ధియోరర్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు, ఎట్టి పరిస్థితులలో తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకోబోమని తేల్చి చెప్పేశారు. పవన్‌ కళ్యాణ్‌ చేజారి పోకుండా కాపాడుకోవాలనే ప్రయత్నంగా జనసేనతో కలిసి సాగుతామని చెప్పారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ టిడిపివైపే ఎక్కువ మొగ్గుచూపుతున్నారని బిజెపి అధిష్టానం గ్రహించినట్లే ఉంది. కనుక బిజెపివైపు ఆశగా చూస్తున్న వైసీపీకి దగ్గరయ్యేందుకు సిద్దం అయినట్లు కనబడుతోంది.

అందుకే వైసీపీ కోరుకొంటున్న విశాఖ రాజధానిలో ఈనెల 12న బహిరంగసభలో పాల్గొనేందుకు, వైసీపీ వాదనలకు బలం చేకూర్చేవిదంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ తరలివస్తున్నారనుకోవచ్చు. ఈ సభని, అభివృద్ధి కార్యక్రమాలను వైసీపీ ఎంతగా హైలైట్ చేయగలిగితే విశాఖ రాజధాని అంశం కూడా అంత బలపడుతుంది. కనుక ఆయన పర్యటనను, శంకుస్థాపన చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను, బహిరంగసభను విజయవంతం చేసే బాధ్యతను జగన్ ప్రభుత్వం భుజం మీద వేసుకొని చకచకా ఏర్పాట్లు చేస్తోంది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వారం రోజులుగా విశాఖలోనే మకాం వేసి బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ADVERTISEMENT

ఈ బహిరంగసభ, కార్యక్రమాలతో వైసీపీకి రాష్ట్రంలో మంచి మైలేజ్, అడ్వాంటేజ్‌ లభిస్తుందని ఏపీ బిజెపి నేతలకు కూడా తెలిసినా ఎవరూ కిక్కురుమనడం లేదు. బహుశః వైసీపీతో నేరుగా పొత్తులు పెట్టుకోకపోయినా అండర్‌స్టాండింగుతో ముందుకు సాగుదామని బిజెపి హైకమాండ్ వారికి సూచించి ఉండవచ్చు. జనసేనను నమ్ముకోవడం కంటే వైసీపీని నమ్ముకొంటే వచ్చే ఎన్నికల తర్వాత మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకి జగన్ సహకరిస్తారనే దూరాలోచన కూడా కనిపిస్తోంది. రాజకీయంగా చూస్తే ఇది మంచి ఆలోచనే. కానీ ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే ఇది చాలా దారుణమైన నిర్ణయమే అని చెప్పకతప్పదు.

ఏపీలో బిజెపికి ఆదరణ లేకపోయినా దాని వెనుక అత్యంత శక్తివంతమైన కేంద్ర ప్రభుత్వం ఉంది కనుక ఒకవేళ దానితో పరోక్షంగానైనా బలమైన స్నేహ సంబంధాలు కలిగి ఉండటం ఏపీలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతో కొంత తోడ్పడవచ్చు. అందుకే విశాఖ వస్తున్న ప్రధాని నరేంద్రమోడీని ప్రసన్నం చేసుకొనేందుకు జగన్ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది.

ప్రధాని నరేంద్రమోడీ విశాఖ పర్యటన తర్వాత బిజెపి, జనసేనల పొత్తులపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదీ ఒకందుకు మంచిదే. ఇప్పుడు జనసేనను కూడా బిజెపి వద్దనుకొంటే పవన్‌ కళ్యాణ్‌ ఒంటరిగా పోటీ చేయాలా లేక టిడిపితో కలిసి పోరాటం చేయాలా? అనే విషయం తేల్చుకోగలుగుతారు.

ADVERTISEMENT
Latest Stories