పెట్టుబడులు ఇప్పుడు కేవలం భూమి, రాయితీలు చూసి వచ్చే రోజులు కావు. రాజకీయ స్థిరత్వం, ప్రభుత్వాల మధ్య సమన్వయం, మౌలిక సదుపాయాలు, భవిష్యత్తుపై నమ్మకం.. ఈ నాలుగు అంశాల కలయిక కనిపించిన చోటుకే పరిశ్రమలు వస్తున్నాయి.
ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సానుకూలతలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. అందుకే రెండేళ్ల వ్యవధిలోనే లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తరలివస్తున్నాయి.
రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత ఉండటం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బలమైన సంబంధాలు కొనసాగడం పెట్టుబడిదారులకు భరోసా కలిగించే అంశాలు.
ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఐటీ రంగంపై ఉన్న ప్రత్యేక ఆసక్తి, అవగాహన, గత అనుభవం కూడా రాష్ట్రానికి అదనపు బలంగా మారింది. అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేస్తూనే దానిని రాష్ట్రానికి ఓ బలమైన ఆర్థిక వనరు అందించే విధంగా ప్రణాళికలు రచిస్తుండటం పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది.
సువిశాలమైన సముద్ర తీరం, అనేక పోర్టులు, రైలు, రోడ్డు, విమాన కనెక్టివిటీ, పర్యాటక ప్రాంతాలు, ప్రసిద్ధ దేవాలయాలు రాష్ట్రానికి సహజంగా లభించిన వరాలు.
ఇవన్నీ కాక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలతో సరిహద్దులు పంచుకోవడం కూడా ఏపీకి సానుకూలంగా మారింది. సరిహద్దు జిల్లాల్లోని పోర్టులు, విమానాశ్రయాలు వాటికి అనుబంధంగా పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, పొరుగు రాష్ట్రాల వైపు నుంచి కూడా ఏపీకి లబ్ధి కలిగిస్తాయి.
ఈ ఆలోచనతోనే ప్రభుత్వం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఒడిశాలకు సమీపంలో పారిశ్రామిక వాడలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు వగైరా ఏర్పాటు చేస్తోంది.
అయితే పెట్టుబడిదారులు అవకాశాల కంటే ప్రమాదాలను ముందుగా లెక్కిస్తారు. గతంలోని చేదు అనుభవాల నేపథ్యంలో కూటమిలో ఎప్పుడైనా చీలిక ఏర్పడితే రాజకీయ అస్థిరత వస్తే పరిస్థితి ఏమిటి? ఇరుగు పొరుగు రాష్ట్రాలలో రాజకీయాలు ఏపీపై ఏమేరకు ప్రభావం చూపుతాయి? ఒకవేళ రాష్ట్ర ప్రజలు మళ్లీ రాజకీయ ప్రయోగం చేసి ప్రభుత్వం మార్చితే పరిస్థితి ఏమిటి? అనే పలు కోణాలలో కూడా ఆలోచిస్తారు.
కనుక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల సానుకూలతలను వివరిస్తూనే, భవిష్యత్లో వారికి అటువంటి సమస్యలు తలెత్తవనే నమ్మకం కల్పించాల్సి ఉంటుంది. అందుకు తగిన విధంగా రాజకీయాలు కూడా చేయాల్సి ఉంటుంది.
అప్పుడే పెట్టుబడిదారులు ధైర్యంగా ఏపీకి తరలివస్తారు. అప్పుడే విభజనతో, రాజకీయ ప్రయోగాలతో గాయపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా కోలుకోగలదు.




