స్వర్గలోకం నుంచి గంగా నదిని భూలోకానికి తెచ్చేందుకు భగీరథ మహర్షి చేసిన ఘోర తపస్సే ‘భగీరథ’ ప్రయత్నం అంటారు. అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ప్రక్రియకు భగీరథ ప్రయత్నం ను ఉదాహరణగా చెపుతుంటారు.
అయితే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ని అధికారంలోకి తెచ్చేందుకు బీజేపీ అధిష్టానం ఒక రకంగా అటువంటి ‘భగీరథ’ ప్రయత్నాలే చేస్తుంది. అలాగే కేంద్ర మంత్రిగా, తెలంగాణ కరీంనగర్ ఎంపీ గా తన తనయుడు బండి భగీరథ ను పోక్సో కేసు నుంచి తప్పించేందుకు బండి సంజయ్ సైతం ‘భగీరథ’ ప్రయత్నాలు చేస్తున్నారంటూ బండి ప్రత్యర్థులు, బీజేపీ వ్యతిరేకులు రోడ్డెక్కుతున్నారు.
తెలంగాణలో బీజేపీ ని ఈసారి అధికారం దిశగా నడిపించాలని భావించిన ప్రతి సారి టి. బీజేపీ కి అనుకోని రాజకీయ చిచ్చులు ఎదురవుతూనే వస్తున్నాయి. బండి సంజయ్ టి.బీజేపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న సమయంలో అప్పటి అధికార బిఆర్ఎస్ కి టి. బీజేపీ గట్టి పోటీగా మారింది.
ఒకానొక సందర్భంలో తెలంగాణలో బీజేపీ నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ ను కూడా దాటుకుని రెండవ స్థానంలోకి వచ్చిందా అన్నట్టుగా దూసుకుపోయింది. కానీ కట్ చేస్తే బీజేపీ అధిష్టానం తీసుకున్న రాష్ట్ర అధ్యక్ష మార్పు నిర్ణయం తిరిగి బీజేపీ ని యధాస్థానంలోకి తీసుకెళ్ళిపోయింది. ఈటెల బీజేపీ ఎంట్రీ తో బీజేపీ లో చిగురించిన అధికార ఆశలు టి. బీజేపీ లో మొదలైన వర్గ పోరు రాజకీయాలతో చల్లారిపోయింది.
ఇలా టి. బీజేపీ తెలంగాణలో అధికారం కోసం దశాబ్దాలుగా భగీరథ ప్రయత్నాలు చేస్తూనే వస్తుంది. అయితే అందుకు తమ వంతుగా బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణలో సభలు, సమావేశాలతో టి. బీజేపీ శ్రేణులలో సమాధైపోతున్న అధికార ఆశలను ఎప్పటికప్పుడు చిగురింపచేస్తూ వస్తుంది.
తాజగా దశాబ్దాల రాజకీయ పోరాటంతో వెస్ట్ బెంగాల్ లో అధికారాన్ని అందుకున్న బీజేపీ తన నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ నే అన్న విధంగా మోదీ తో పార్టీ సభను నిర్వహించి, పార్టీ శ్రేణులలో జోష్ ను తెచ్చింది. కట్ చేస్తే మోదీ పర్యటనతో టి. బీజేపీ లో మొలకెత్తిన జోష్ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ వివాదంతో ఆవిరైపోయిందనే చెప్పాలి.
కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ తనయుడు ఇలా మైనర్ బాలిక పై వేధింపులు అంటూ ఆరోపణలు ఎదుర్కోవడం, ఆయన పై పోక్సో కేసు పెట్టడం, భగీరథ అరెస్టు విషయంలో జాప్యం జరగడం బండి సంజయ్ తో పాటుగా టి.బీజేపీ ని కూడా రాజకీయంగా ఇరకాటంలో పడేసింది.
భగీరథ విషయంలో బీజేపీ అటు తప్పించుకోలేక ఇటు సమర్ధించలేక ఎటు వెళ్లలేని దయనీయ పరిస్థితిలో ఇరుక్కుపోయింది. ఆయనను ఈ కేసు నుంచి బయటకు తెచ్చేందుకు బండి సంజయ్ సైతం ‘భగీరథ’ ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు మండిపడుతున్నారు.
ఇటువంటి నేతలు తమ అధికార బలంతో, తమ హోదా బలగంతో ఆరోపణలు మోస్తున్న వారిని రక్షించేందుకు చూస్తున్నారని, అటువంటి వారికీ కొమ్ముకాస్తున్న బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం మరో భగీరథ ప్రయత్నమే అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.




