జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బిజెపిపై ఓ స్థాయిలో విరుచుకుపడి టిడిపితో కలిసి పనిచేస్తామని ప్రకటించేసరికి బిజెపి పెద్దలలో చలనం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ బిజెపి వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్ విజయవాడలో వాలిపోయి రాష్ట్ర బిజెపి నేతలతో చర్చించారు.
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, “జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మా పార్టీతో కలిసి పనిచేసేందుకు రోడ్ మ్యాప్ అడిగారు. దానిపై మేము అంతర్గతంగా చర్చించుకొని తెలియజేస్తాము. ఈ విషయంలో మా సీనియర్ నేత కన్నా లక్ష్మినారాయణ చేసిన వ్యాఖ్యలను మేము సానుకూలంగానే స్వీకరిస్తాము తప్ప సీరియస్గా తీసుకోము. ఇక వచ్చే ఎన్నికలలో మేము టిడిపితో పొత్తులు పెట్టుకోబోము. టిడిపికి మా పార్టీ తలుపులు మూసేశాము. జనసేనతోనే కలిసి ముందుకు సాగుతాము,” అని చెప్పారు.
టిడీపీతో పొత్తులు పెట్టుకోమని బిజెపి విస్పష్టంగా చెప్పేయడం వలన టిడిపికి ఒక విదంగా మంచిదే. ఎందుకంటే ఏపీలో టిడిపి బిజెపిపై ఆధారపడి లేదు. బిజెపియే జనసేనపై ఆధారపడి ఉందనే సంగతి బహిరంగ రహస్యం. కానీ ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం, బిజెపిల నిర్లిప్త ధోరణితో పవన్ కళ్యాణ్ కూడా విసుగెత్తిపోయున్నారు. అందుకే మొన్న మంగళగిరిలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీపై తనకు ఎంత గౌరవం ఉన్నప్పటికీ రాష్ట్రంలో రౌడీలు, గూండాలు రాజ్యం ఏలుతుంటే, ప్రజలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉందని, కనుక తన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతానని చెప్పేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్లిప్తవైఖరి కారణంగానే ఏపీలో ఇంత అరాచక పరిస్థితులు నెలకొని ఉన్నాయని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పేశారు. అందుకే టిడిపితో కలిసి పనిచేసేందుకు సిద్దమని ప్రకటించారు.
టిడిపితో పొత్తులు పెట్టుకోబోమని బిజెపి చెప్పేసింది కనుక పవన్ కళ్యాణే ఇప్పుడు తాను ఏ గట్టున ఉండాలో తేల్చుకోవలసి ఉంటుంది. రాష్ట్రంలో బిజెపి మనుగడకు తన ఇమేజ్ని ఉపయోగించుకొంటోంది తప్ప రాష్ట్రానికి ఏమీ చేయడం లేదనే సంగతి పవన్ కళ్యాణ్కి తెలియదనుకోలేము. ఒకవేళ పవన్ కళ్యాణ్ బిజెపితో కలిసి ముందుకు సాగాలనుకొంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమి మేలు చేస్తుందో ముందుగానే హామీ తీసుకోవడం, ప్రత్యేకహోదా హామీలాగ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయదనే నమ్మకం కల్పించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఆయన టిడిపితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకొంటే బిజెపిని వదిలించుకొని రావలసిఉంటుంది. అదే కనుక జరిగితే బిజెపికి ఇక వైసీపీయే శరణ్యం. బహుశః బిజెపి పెద్దలకి ఈ ఆలోచన ఉన్నందునే టిడిపితో పొత్తులు పెట్టుకోబోమని సునీల్ దియోధర్ చేత చెప్పించి ఉండవచ్చు. అంటే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఇమేజ్ని ఉపయోగించుకొంటూ, ఎన్నికలకు ముందు లేదా తర్వాత వైసీపీతో చేతులు కలిపే ఆలోచనలో ఉందేమో?
అంటే తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైసీపీతో భవిష్యత్లో దోస్తీ గురించి బిజెపి ఆలోచిస్తున్నట్లయితే, దానిని పవన్ కళ్యాణ్ నమ్ముకోవడం అమాయకత్వమే అవుతుంది. కనుక జనసేన, టిడిపిలు రెండూ కూడా మరింత లోతుగా ఆలోచించుకొని త్వరగా నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. లేకుంటే సమయం మించిపోయింది మిత్రమా… అనుకొని బాధపడాల్సి ఉంటుంది.



