బీజేపీ పై రాజకీయ యుద్ధం ప్రకటిస్తున్న ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాలలో పాతాళానికి పడిపోతున్నాయి. అయితే అది యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా లేదా బీజేపీ రాజకీయ ప్రణాళికలో భాగంగా జరుగుతున్నాయా అన్నది ఇప్పటికి స్పష్టత రాలేదు కానీ జరుగుతున్నాయి.
అయితే 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని నడుపుతున్న టీడీపీ పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ కేంద్ర బీజేపీ పై రాజకీయ యుద్ధం ప్రకటించింది. దీనితో 2019 ఎన్నికలలో టీడీపీ అనూహ్యంగా 23 సీట్లకు పరిమితం అవ్వడం వైసీపీ 151 సీట్లతో అధికార పీఠాన్ని దక్కించుకోవడం జరిగిపోయింది.
అలాగే ఇటు తెలంగాణ విషయానికొస్తే 2023 ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ కూడా బీజేపీ పై రాజకీయ యుద్ధం ప్రకటించింది. అప్పటి వరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న తెరాస ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ జాతీయ పార్టీగా ప్రకటిస్తూ బిఆర్ఎస్ గా రూపాంతరం చేసారు.
ఇక నుండి కేసీఆర్ ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు మొదలుపెడతారని, ఢిల్లీ రాజకీయాలలో బిఆర్ఎస్ చక్రం తిప్పబోతుందని కేసీఆర్ కేంద్ర బీజేపీ పై తొడలు కొట్టారు. కట్ చేస్తే పదేళ్ల బిఆర్ఎస్ పాలన కాస్త పాతాళానికి పడి కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు.
ఇక వెస్ట్ బెంగాల్ లో మమత, తమిళనాడు లో స్టాలిన్ సైతం బీజేపీ తీసుకొచ్చిన నియోజకవర్గాల పునరావిభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ల బిల్లు పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర బీజేపీ కి వ్యతిరేకంగా నడుం బిగించారు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
చివరికి ఈ రెండు పార్టీలు కూడా తమ తమ రాష్ట్రాలలో అధికారానికి దూరమయ్యాయి. అలాగే అటు టీఎంసీ అధినేత మమతా ఇటు డీఎంకే అధినేత స్టాలిన్ ఇద్దరు కూడా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు.
అయితే ఈ ఓటములన్ని యాదృచ్చికంగా జరుగుతున్నాయో లేదో చెప్పలేం కానీ ఏ రాజకీయ పార్టీ అయినా బీజేపీ కి వ్యతిరేకంగా రాజకీయ యుద్ధం ప్రకటిస్తుంది అంటే ఆ రాజకీయ పార్టీ మాత్రం రాజకీయంగా సమాధి అవుతూ వస్తున్న మాట మాత్రం వాస్తవం అనే చెప్పాలి.
ఇందుకు నాడు టీడీపీ నుంచి బిఆర్ఎస్, నేడు టీఎంసీ, డీఎంకే ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలిచాయి.




