తెలంగాణ రాజకీయాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలిచిన మొయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీ పై ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఎటువంటి స్పందన బయటకు రాలేదు. మార్చ్ 14 న జరిగిన ఈ పార్టీలో టీడీపీ ఎంపీ తో పాటుగా బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పేరు బయటకొచ్చాయి.
ఇందులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్, బిఆర్ఎస్ కు చెందిన తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీ వ్యాపారవేత్త నమిత్ శర్మ, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, సిల్వర్ శరత్ కుమార్, ఆర్ ప్రియాంక రెడ్డి మరో ముగ్గురి పేర్లు బయటకొచ్చాయి.
ఈ కేసులో మొత్తం 11 మందిని అరెస్టు చేయగా అందులో ఆరుగురికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. ఆ లిస్ట్ లో టీడీపీ ఎంపీ తో పాటుగా బిఆర్ఎస్ నేతల పేర్లు కూడా ఉండడంతో కేసు రాజకీయ రంగు పూసుకుంది. దీనితో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు విచారణకై సిట్ ని నియమించగా ఈ కేసులో A1గా బిఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి పేరు నమోదయ్యింది.
అలాగే ఆయనతో పాటు ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, డ్రగ్స్ పార్టీలో కాల్పులు జరిపిన వ్యాపార వేత్త నమిత శర్మ కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే బిఆర్ఎస్ నేత ఇలా ఫామ్ హౌస్ పార్టీ పేరుతో డ్రగ్స్ వాడుతూ అడ్డంగా దొరికిపోయిన ఆ పార్టీ పై కానీ ఆ పార్టీ నేత ఘనకార్యం పై కానీ బీజేపీ ఇప్పటి వరకు ఎటువంటి స్పంద లేకుండా మౌనంగా ఉండడం పై కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తీవ్రంగా స్పందించారు.
తెలంగాణ రాజకీయాలలో ఇంత కీలకమైన అంశం పై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందంటూ కాంగ్రెస్ తన అనుమానాలను బయటపెట్టింది. బిఆర్ఎస్ నేతల డ్రగ్స్ వినియోగం పై బీజేపీ మౌనం వెనుక ఆ పార్టీకి బిఆర్ఎస్ కి ఉన్న తెరచాటు బంధమే కారణమా.?
కేసీఆర్ కుమార్తె కవిత ఆరోపించినట్టుగా బిఆర్ఎస్ త్వరలో బీజేపీలో విలీనం కాబోతుందా.? లేదా బీజేపీ, బిఆర్ఎస్ తో రాజకీయ పొత్తు కోసం ఆరాట పడుతుందా.? అందుకే బీజేపీ వ్యూహాత్మకంగా ఈ డ్రగ్స్ కేసు పై మౌనం పాటిస్తుందా.? కేసీఆర్ కి బీజేపీ కి ఉన్న అంతర్గత సంబంధాలే బీజేపీ నోటికి తాళం వేస్తున్నాయా.? అంటూ మహేష్ గౌడ్ బీజేపీ – బిఆర్ఎస్ తెరచాటు బంధాల పై బహిరంగ ఆరోపణలు చేసారు.
అయితే తెలంగాణ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలని, తెలంగాణ అధికార పీఠం దక్కించుకోవాలని కలలు కనే బీజేపీ, బిఆర్ఎస్ నేతల డ్రగ్స్ వినియోగం పై మౌనం వహిస్తే అధికార కాంగ్రెస్ నుంచి ఈ స్థాయి విమర్శలు, అనుమానాలు వ్యక్తమవడం సర్వ సహజం.
కాబట్టి బీజేపీ తన చిత్తశుద్ధిని తెలియచేయడానికి, తన పార్టీ శీల పరీక్షను నిరూపించుకోవడానికి బిఆర్ఎస్ పై రాజకీయ యుద్ధం ప్రకటిస్తుందా.? లేదా కాంగ్రెస్ ఆరోపణలను నిజం చేస్తూ వ్యూహాత్మక మౌనం పాటిస్తుందా.? కాంగ్రెస్ విమర్శిస్తున్నట్టుగా బీజేపీ తన రాజకీయ అవసరాల కోసమే ఇటువంటి కేసుల పై మౌనం పాటించడం అంటే అది ఆ పార్టీకి సమాధి కట్టినట్టే అవుతుంది.
ఏదిఏమైనా రాజకీయాలలో నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన నేతలు ఇలా బరితెగించి ఫామ్ హౌస్ పార్టీల పేరుతో డ్రగ్స్ వినియోగించడం రాజకీయానికే కాదు సమాజానికి కూడా అత్యంత ప్రమాదకరం, అలాగే అటువంటి నేతలను ఉపేక్షించడం, వెనకేసుకురావడం కూడా అంతకంటే ప్రమాదం.




