నాటి ‘పదవు’లే రేపటి ‘పొత్తు’లా.?

BJP State Presidents Are The Plans For Tomorrow Alliance

బీజేపీ ఆలోచనలు, వాటిని ఆచరణలోకి తెచ్చే విధానాలు రెండు ఒకే దిశలో పయనిస్తాయి అనేలా బీజేపీ అధిష్టానం తన నిర్ణయాలను ప్రకటిస్తుంది. ఉదాహరణకు రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్ష ఎన్నికలు ఆ పార్టీ భవిష్యత్ ప్రణాళికలకు అద్దం పడుతున్నాయి అనేలా పార్టీ క్యాడర్ నుంచి పార్టీ నాయకుల వరకు ఒక దిశా దశను చూపిస్తున్నాయి.

రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర అధ్యక్ష పదవితో బీజేపీ జరిపిన రాజకీయాలను పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్ధమవుతుంది. ముందు ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, ఇక్కడ 2014 నుంచి 2020 వరకు బీజేపీ లెక్క ఒక విధంగా కొనసాగితే ఆ తరువాత మరో లెక్కతో బీజేపీ ముందుకెళ్లింది.

ADVERTISEMENT

టీడీపీ తో పొత్తులో ఉన్నంతకాలం టీడీపీ కి అనుకూలంగా ఉండే నేతల వైపు మొగ్గు చూపిన బీజేపీ, అటుపిమ్మట టీడీపీ కి వ్యతిరేకంగా, వైసీపీ కి సానుకూలంగా ఉండే నాయకుల వైపు ఆకర్షితమయ్యింది. టీడీపీ తో సానుకూల సంబంధాలు కొనసాగినంత కాలం కంభంపాటి హరిబాబు, కన్నా లక్ష్మి నారాయణ వంటి టీడీపీ అనుకూల నాయకులను ఎంచుకున్న బీజేపీ,

ఆ తరువాత సోము వీర్రరాజు వంటి వైసీపీ విధేయుడి వైపు మొగ్గు చూపింది. అంటే బీజేపీ అధిష్టానం తన నిర్ణయంతో ఏపీలో బీజేపీ భవిష్యత్ స్టాండ్ ఏంటో చెప్పకనే చెప్పిందన్నమాట. సోము ఏపీ బీజేపీ అధ్యక్ష హోదాలో ఉన్నంతకాలం బీజేపీ వైసీపీ కి సానుకూలంగా తెరచాటు రాజకీయం నడిపింది.

అధికారికంగా జనసేనతో స్నేహ హస్తం ఇస్తూనే, అనధికారికంగా వైసీపీ చర్యలకు మద్దతు పలికింది. సోము బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్నంతకాలం వైసీపీ రాజకీయంతో టీడీపీ గొంతు నొక్కే ప్రయత్నం చేసింది, జనసేన కళ్ళు మూసేందుకు సిద్దమయ్యింది. ఇక ఆ తరువాత 2024 ఎన్నికలకు టీడీపీ, జనసేన కూటమిలో కలిసే ప్రక్రియలో భాగంగా సోము స్థానాన్ని బాబు కుటుంబ సభ్యురాలైన పురందరేశ్వరి కి కట్టబెట్టింది.

దీనితో బీజేపీ అధిష్టానం త్వరలో టీడీపీ తో స్నేహ హస్తానికి సిద్దమయ్యింది అనే సంకేతాలు పార్టీ నాయకుల నుంచి పార్టీ క్యాడర్ వరకు అందించినట్టయ్యింది. పురందరేశ్వరి రాకతో బీజేపీ ఏపీలో వైసీపీ దూరంగా టీడీపీ, జనసేనకు దగ్గరగా జరిగింది. ఇక ఇప్పుడు pvn మాధవ్ నియామకంతో కూటమి పొత్తు బలోపేతానికి అడుగులు వేసేలా ముందుకెళ్తుంది.

ఇక తెలంగాణ విషయానికొస్తే, 2014 నుంచి 2020 వరకు తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఆస్కారం లేకపోవడంతో న్యూట్రల్ నాయకులను, పార్టీ సీనియర్ నేతల ను (కిషన్ రెడ్డి, లక్ష్మణ్) పార్టీ అధ్యక్షులుగా నియమించిన బీజేప అధిష్టానం ఆ తరువాత 2020 లో బండి సంజయ్ ని తెరమీదకు తెచ్చింది.

బండి అధ్యక్షతన తెలంగాణలో బీజేపీ, బిఆర్ఎస్ కారును దాటే ప్రయత్నం చేసింది, కాంగ్రెస్ హస్తాన్ని వెనక్కినట్టే ప్రణాళికలు వేసింది. ఒకానొక దశలో బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ నేనా అన్న అనుమానాలు కూడా కాంగ్రెస్ నేతలను వేధించాయి. అటు బిఆర్ఎస్ కు ఇటు కాంగ్రెస్ కు సమ దూరంలో రెబల్ నాయకుడిగా బండి సంజాయి తెలంగాణలో బీజేపీ ప్రయాణాన్ని పరుగులు పెట్టించారు.

ఆ తరువాత బీజేపీ అధిష్టానం తీసుకున్న అధ్యక్ష మార్పు నిర్ణయం బీజేపీ పతనానికి నాందిగా మారింది. బండి సంజయ్ స్థానాన్ని తిరిగి కిషన్ రెడ్డితో నింపిన బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ ను దెబ్బకొట్టి, బిఆర్ఎస్ కు పరోక్ష సహకారం అందించేలా ప్రణాళికలు వేసినప్పటికీ బీజేపీ అధిష్టానం పాచికలు రాజకీయంగా ఫలితాలనివ్వలేకపోయాయి.

ఇక ఇప్పుడు తెలంగాణలో మూడో ప్రత్యామ్నాయానికి అవకాశం ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా బీజేపీ అధిష్టానం ఎన్. రామచందర్ రావు పేరును తెలంగాణ రాజకీయాలకు పరిచయం చేసి తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు గండి కొట్టింది. అయితే ఈయన రాక బీజేపీ, బిఆర్ఎస్ బంధానికి సాక్ష్యం అంటూ కాంగ్రెస్ తో పాటు సొంత పార్టీ వర్గీయులు కూడా బీజేపీ అధిష్టానం పై గుర్రుమంటున్నారు.

రామచందర్ పేరు తెరమీదకు తేవడంతోనే బీజేపీ తెలంగాణలో తన భవిష్యత్ ప్రణాళికలను చెప్పకనే చెప్పిందా.? అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో మొదలయ్యాయి. గల్లీలో కొట్లాడడం, ఢిల్లీలో కలుసుకోవడం బీజేపీ, బిఆర్ఎస్ రాజకీయంలో ఒక భాగమేనా.? భవిష్యత్ లో తెలంగాణలో జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ ను భూస్థాపితం చెయ్యాలన్న ఆలోచనతోనే బీజేపీ అధ్యక్ష పదవి రాంచందర్ కు దక్కిందా.?

ఇలా రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్ష పదవులతో బీజేపీ అధిష్టానం తన భవిష్యత్ ప్రణాళికలను పరోక్షంగా ముందుగానే ప్రకటిస్తుందా..? ఈ పదవులే రేపటి పొత్తులు కానున్నాయా.? బీజేపీ అధిష్టాన నిర్ణయాల ట్రాక్ రికార్డు ఒక్కసారి పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు సమాధానం ఇట్టే దొరుకుతుంది.

ADVERTISEMENT
Latest Stories